టార్గెట్ క్లీన్స్వీప్: ముందస్తు మూడ్లో వైఎస్ జగన్: మరో కీలక భేటీ: అజెండా ఇదే
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముందస్తు ఎన్నికలకు సమాయాత్తమౌతోన్నారా?..వచ్చే ఏడాదిలో తెలంగాణతో పాటే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది కొద్దిరోజులుగా. తొలి రెండున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా వైఎస్ జగన్.. పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తోండటమే దీనికి కారణం.

క్లీన్స్వీప్..
ఈ మధ్యకాలంలో ఆయన తరచూ పార్టీ నాయకులతో సమావేశమౌతోన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్స్వీప్ చేయాలనే టార్గెట్ను నిర్దేశించుకున్నారాయన. 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనికోసం పార్టీ క్యాడర్తో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ఇటీవలే ఎమ్మెల్యేలను కలుసుకొన్నారు.

కోఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులతో..
ఇప్పుడు తాజాగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరు కావాలంటూ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులకు ఇదివరకే సమాచారాన్ని పంపించారు. అజెండా సైతం నిర్ధారించారు. బూత్ స్థాయి వరకు పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వైఎస్ జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఫీడ్బ్యాక్..
గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సమావేశానికి సంబంధించి అజెండాను నిర్ధారించినట్లు సమాచారం. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని- అసెంబ్లీ బరిలో దిగాల్సి ఉంటుందనే సందేశాన్ని వైఎస్ జగన్ పార్టీ జిల్లా స్థాయి క్యాడర్కు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

మాజీమంత్రులు..
ఈ సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పీ అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, కొడాలి నానితో పాటు 26 జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు హాజరు కానున్నారు. చిత్తూరు-అనంతపురం-శ్రీ సత్యసాయి-అన్నమయ్య జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నారు. కర్నూలు-నంద్యాల జిల్లాలకు సజ్జల రామకృష్ణా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కడప-తిరుపతి జిల్లాలకు మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకులుగా ఉన్నారు.

ఈ జిల్లాలకు..
నెల్లూరు-ప్రకాశం- బాపట్ల జిల్లాలకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, గుంటూరు-పల్నాడు జిల్లాలకు కొడాలి నాని, ఎన్టీఆర్-కృష్ణా జిల్లాలకు మర్రి రాజశేఖర్, పశ్చిమ గోదావరి- తూర్పుగోదావరి-కాకినాడ-డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశాఖపట్నం-అనకాపల్లి-అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, పార్వతీపురం మన్యం-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలకు బొత్ససత్యనారాయణ కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తోన్నారు.












Click it and Unblock the Notifications