నోట్ పంపాం, వేరే ఉద్దేశం లేదు: ప్రోరోగ్పై సిఎంవో
హైదరాబాద్: శాసనసభను ప్రోరోగ్ చేయాలనే వివాదంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) శుక్రవారం వివరణ ఇచ్చింది. తెలంగాణ బిల్లు ప్రతిపాదనను ఆలస్యం చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభను ప్రోరోగ్ చేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సిఎంవో వివరణ ఇస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
శాసనసభను ప్రోరోగ్ చేయాలని నోట్ పంపిన మాట వాస్తవమేనని, ఇందులో దురుద్దేశ్యాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. కొన్ని ఆర్డినెన్స్లు జారీ చేసే అవకాశం లేనందున శాసనసభను ప్రోరోగ్ చేయాలని లేఖ రాశామని, శాసనసభను ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్లు జారీ చేయడం కష్టమని వివరించింది.
పాలనాపరమైన అంశం కాబట్టి శాసనసభను ప్రోరోగ్ చేయాలని సూచించామని, ఈ విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని సిఎంవో వివరించింది. బిల్లు శానససభకు వచ్చినప్పుడు ఆలస్యం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలనే ఎత్తుగడలో శాసనసభను ప్రోరోగ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్కు సిఫార్సు చేసినట్లు వార్తలు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
శాసనసభను ప్రోరోగ్ చేయకూడదని కోరుతూ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిపై తెలంగాణ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో సిఎంవో వివరణ ఇచ్చినట్లు కనిపిస్తోంది.