అభ్యంతరం ఇలా వ్యక్తం చేస్తారా.. సీఎంవో ఆగ్రహం: అధ్యక్షుడి తీరుపై ఉద్యోగుల బహిరంగ లేఖ..!
ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలింపు ప్రతిపాదన సచివాలయ ఉద్యోగుల పైన ఎఫెక్ట్ చూపింది. ఇప్పటికే విశాఖకు తరలింపు ప్రతిపాదన పై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సచివాలయంలో సమావేశమైన ఉద్యోగులు..తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మీడియా ముందకొచ్చి ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా స్పందించారు.
దీని పైన సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం పై సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని పిలిపించి...ఉద్యోగులు ఏది మాట్లాడినా సంఘం ద్వారా మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేసారు.
ఉద్యోగుల స్పందనపై...
సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలించే ప్రతిపాదనల పైన సచివాలయ ఉద్యోగులు మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేయటం వివాదాస్పదమైంది. దీనిని ముఖ్యమంత్రి కార్యాలయ అధికా రులు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. దీని పైనా ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
రాజధాని ఆకస్మిక తరలింపుపై తమ ఆవేదన, ఇబ్బందులు చెప్పుకొనే హక్కు కూడా తమకు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసోసియేషన్ తమ వాదనకు విలువ ఇవ్వనప్పుడు మీడియాను ఆశ్రయిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి అమరావతికి తరలి వచ్చే సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగి సమావేశంలో వారు మరోసారి తమ అభిప్రాయలను స్పస్టం చేయాలని భావిస్తున్నారు.

అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ..
ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కొందరు సచివాలయ అసోసియేషన్ అధ్యక్షుడికి బహిరంగా లేఖ రాసారు. రాజకీయ నాయకుడి అవతారం చాలించి, ఉద్యోగ సంఘ నాయకుడిగా వ్యవహరించండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నాయకుడు సంఘం అధ్యక్షుడిగా ఉంటే, సమస్యలు సత్వరమే పరిష్కరిస్తారని నమ్మాం.
అందుకే మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేశాం. కానీ, రాజధానిపై మీరు మాట్లాడిన తీరు చూశాక.. మీరు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తినట్టున్నారంటూ తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుడి అవతారం చాలించి, ఉద్యోగ సంఘ నాయకుడిగా మెజార్టీ ఉద్యోగుల అసమ్మతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications