Coal Crisis : ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ : బొగ్గు కొరత ఉన్నా సరఫరా చేస్తున్నాం-ట్రాన్స్ కో..!!
ఏపీలో బొగ్గు సరఫరా లేక..ధర్మల్ పవర్ పైన తీవ్ర ప్రభావం పడుతోందని ఏపీ ట్రాన్స్ కో అందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ట్రాన్స్ కో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో బొగ్గు కొరత ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కమ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించింది. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఏపీ జెన్ కో ప్లాంట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని పేర్కొంది. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని వివరించింది.
ఏపీలో విద్యుత్ సంక్షోభం దిశగా
ప్రస్తుత కొరత కారణంగా సెప్టెంబరు నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని వివరించింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని పేర్కొంది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ కు 15-20 రూపాయల వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. బొగ్గుకొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరాను చేయగలుగుతున్నామంటూ చెప్పుకొచ్చింది.
పెరుగుతున్న డిమాండ్.. తగ్గుతున్న సరఫరా
ఏపీలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని స్పష్టం చేసింది. 8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని వివరించింది. 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని స్పష్టం చేసింది. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని వెల్లడించింది.
కేంద్రం సహకరిస్తేనే పరిస్థితిలో మార్పు
అయితే, ఏపీ ప్రభుత్వం తమకు నిత్యం 20 రేక్ ల బొగ్గు సరఫరా చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే, కేంద్రం బొగ్గు కొరత లేదని చెప్పటం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యుత్ వినియోగంలో సహకరించాలని ఏపీ ప్రభుత్వం వినియోగదారులకు పదే పదే కోరుతోంది. పీక్ అవర్స్ లో ఏసీలు వాడవద్దని సూచిస్తోంది.
Recommended Video
ఇక విద్యుత్ కోతలు తప్పవంటూ
ఇక, దసరా పూర్తయిన తరువాత ఇప్పుడు అక్కడక్కడా అమలు అవుతున్న కోతలు.. ఇక అన్ని ప్రాంతాల్లో అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లోగా బొగ్గు సరఫరా మెరుగు పడితే కోతల వైపు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో..కేంద్రం వైపు బొగ్గు సరఫరా కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. దీంతో పాటుగా కేంద్ర అధికారులతో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకుంది.