తెలంగాణదే నిథమ్: తెలంగాణకు ఆదానీ కరెంట్ సరఫరా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సోమవారం సచివాలయంలో కోకకోలా కంపెనీ ప్రతినిధులు కలుసుకున్నారు. తమ కంపెనీకి చెందిన లావాదేవీలను, ప్రొఫైల్ను వారు కెసిఆర్కు వివరించారు. రాష్ట్రంలో కోకకోలా కంపెనీకి అతి పెద్ద మార్కెట్ ఉందని వారు సిఎంకు వివరించారు. హైదరాబాదులో వేయి కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే ప్లాంటుకు ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో తమ కంపెనీ పాల్గొంటుందని వారు చెప్పారు.
తెలంగాణ సహా అవసరమైన రాష్ట్రాలకు తాము విద్యుత్తును అందిస్తామని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ చెప్పారు. 2020నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే స్థాయికి తాము ఎదుగుతామని ఆయన చెప్పారు. సోమవారం ఆయన సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో సమావేశమయ్యారు.
తెలంగాణ ఎదుర్కుంటున్న విద్యుత్తు కోతను అధిగమించేందుకు ఆదానీ గ్రూప్ ముందుకు వస్తే సంతోషమని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోందని, ఏకగవాక్ష విధానంలో అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల కోసం భూములను గుర్తించామని, కొన్ని రకాల మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేసిన తర్వాత పరిశ్రమలకు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
నిథమ్ తెలంగాణదే...
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథం) తెలంగాణకే చెందుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నిథమ్ చైర్మన్గా ఎపి ప్రత్యేక కార్యదర్శి ఉండేందుకు వీలు లేదని, విభజన చట్టం పదో షెడ్యూల్ ప్రకారం నిథమ్ తెలంగాణకే చెందుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. పరస్పర అవగాహన మేరకు ఈ సంస్థ ఎపికి సేవలందిస్తుందని ఆయన చెప్పారు. నిథమ్ చైర్మన్గా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించినట్లు తెలిపారు. నిథమ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కూడా జరిగిందని వెల్లడించారు.