సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు- ఎన్టీఆర్ భవన్లో కోడెల వర్సెస్ జీవీ వర్గాల కొట్లాటపై చర్చ !
పల్నాడు టీడీపీలో గ్రూపు వివాదాలు సద్దుమణగడం లేదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎవరికి వారుగా ఉంటున్న టీడీపీని ఏకతాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం చేపట్టిన సంస్ధాగత కమిటీల నియామకం మరో చిచ్చు రేపింది. నిన్న సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్లో తెలుగు తమ్ముళ్లు కొట్టుకునేదాకా వెళ్లడం పార్టీలో చర్చనీయాంశమైంది.
గత ఎన్నికల్లో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ ఓటమి, అనంతరం ఆయన మృతి నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టుకోసం ఆయన కుమారుడు కోడెల శివరాం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు తన ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీ పదవుల్లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య పోరు సాగుతోంది. నిన్న పార్టీ పదవుల పంపకం కోసం వచ్చిన పరిశీలకుల సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సత్తెనపల్లి టీడీపీ సంస్థాగత కమిటీ విషయంలో కోడెల శివరాం,వైవి ఆంజనేయులు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.దీంతో పార్టీ సంస్ధాగత నియామకాలు రసభసగా మారాయి. పార్టీ సంస్ధాగత కమిటీ నియామకం కోసం కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సత్తెనపల్లి పరిశీలకులు గన్నె వెంకట నారాయణ ప్రసాద్ వచ్చారు.
ఈ సమయంలో వేరే నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇక్కడికి రావడంపై కోడెల వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో కోడెల శివరామ్ ,జీవి ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీంతో ఆయా నేతల అనుయాయులు కుర్చీలతో కొట్టుకునే వరకూ వెళ్లారు. చివరికి కమిటీ మిటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బయటకు వెళ్లిపోయారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది.