సోము వీర్రాజు వ్యవహారంలో సూపర్ ట్విస్ట్?
ఇప్పటికే సోము వీర్రాజుపై అసమ్మతి నేతలు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ పరిస్థితి రోజురోజుకు అతి దీనంగా దిగజారిపోతోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చక పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. వారిలో కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒకరు. పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇతర పార్టీలో చేరడమంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అనే విషయాన్ని అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మురళీధరన్ కి బాధ్యతలు అప్పగించారు.

ఏపీకి వచ్చిన మురళీధరన్
ఇప్పటికే సోము వీర్రాజుపై అసమ్మతి నేతలు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. వారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధరన్ కూడా ఏపీకి వచ్చారు. పలువురు నేతలు రాజమండ్రిలో ఆయనకు స్వాగతం పలికారు. సోము వీర్రాజు మాత్రం కడప పర్యటనలో ఉన్నారు. వాస్తవానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు వస్తే పార్టీ అధ్యక్షుడే స్వాగతం పలుకుతారు. కానీ బీజేపీలోని నేతలంతా రోజురోజుకు తమ స్వరంలోని తీవ్రతను పెంచుతున్నారు. కన్నా టీడీపీలో చేరికపై సోము స్పందించనప్పటికీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. పార్టీ కన్నాను బాగా చూసుకుందన్నారు.

దళితులకు, మైనార్టీలకు విలువేదీ?
బీజేపీ సీనియర్ నాయకుడు దారా సాంబయ్య కూడా తాజాగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. దళితులకు, మైనార్టీలకు పార్టీలో ఏమాత్రం ప్రాముఖ్యత లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు నూతన కమిటీని నియమించారు. అయితే ఏకపక్ష ధోరణిలో పదవుల కేటాయింపు జరిగిందంటూ అసంతృప్తులంతా ఆరోపిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కాకినాడ, కోనసమీ జిల్లాల్లోని బీజేపీ నాయకత్వం రెండు వర్గాలుగా చీలిపోయింది. వీరి మధ్య పోరు తారస్థాయిలో జరుగుతోంది.

సోముపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు
రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించిన ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్కు పార్టీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పార్టీ నాయకులు రాజమండ్రి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఆరోపణలన్నింటికీ కేంద్ర బిందువుగా సోము వీర్రాజు ఉన్నారు. అయితే వీర్రాజుకు మద్దతుగా మరికొందరు నాయకులు వచ్చి మురళీధరన్ కు అర్జీలు సమర్పించారు. ఢిల్లీ అధిష్టానం సోము వీర్రాజును పదవిలో ఉంచుతుందా? వేరెవరినైనా నియమిస్తుందా? అనే సందేహం బీజేపీ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications