రంజాన్ ఆరంభం వేళ.. శ్రీకాళహస్తిలో కంప్లీట్ లాక్డౌన్: తొలి టౌన్గా: వైసీపీ ఎమ్మెల్యే పనేనంటూ
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణం పూర్తిస్థాయి లాక్డౌన్లోని వెళ్లిపోయింది. ఈ పట్టణంలో ఒకేసారి భారీ ఎత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి వచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇక ఎక్కడివారక్కడే ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి మినహాయింపు కాదని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు కరోనా కాటు: తొలి పాజిటివ్ కేసు? ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి..
12 పాజిటివ్ కేసులు నమోదు..
శ్రీకాళహస్తిలో ప్రస్తుతం 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 11 కేసులు ఒకేరోజు వెలుగు చూశాయి. రెండురోజుల తరువాత మరో కేసు బయటపడింది. కరోనా వైరస్ పాజిటివ్గా గుర్తించిన వారిలో అత్యధికులు ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు. వారి కుటుంబ సభ్యులేనని సమాచారం. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఆరంభం వేళ.. శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉన్నత స్థాయి సమావేశం..
జిల్లాల్లో ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి సిసోడియా, డీఐజీ కాంతిరాణా టాటా, చిత్తూరు జిల్లా అర్బన్ పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఆర్డీఓ కనక నరసారెడ్డిలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ..
పూర్తిస్థాయి లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో.. ఏ ఒక్కరు కూడా తమ ఇంటి గడప దాటి బయటికి రావొద్దని కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా హెచ్చరించారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు మినహా మరెవ్వరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు లేదని వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా సమీపంలో ఉండే గ్రామాల నుంచి శ్రీకాళహస్తికి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటికి రావొద్దని భరత్ గుప్తా సూచించారు. కరోనా వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించిన గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
పోలీసుల పహారా..
గురువారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో.. పట్టణంలో పెద్ద ఎత్తున పహారాను నిర్వహించారు. రాత్రంతా పోలీసు వాహనాల సైరన్ మోతలతో శ్రీకాళహస్తి పట్టణం మారుమోగిపోయింది. వీధులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. వీధుల్లో నుంచి ఎవరూ బయటికి రాకుండా ఉండటానికి అడ్డుగా బ్యారికేడ్లను అమర్చారు. పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఇళ్లను దాటి బయటికి రావద్దని పోలీసుల మైకుల ద్వారా హెచ్చరికలను జారీ చేశారు.
ఎమ్మెల్యే వైఖరే కారణమంటోన్న టీడీపీ..
శ్రీకాళహస్తిలో పరిస్థితులు చేయి దాటడానికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి వైఖరే కారణమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో నిర్వహించినట్లుగా ఆయన ప్రచారం చేసుకున్నారని మండిపడుతున్నారు. ట్రాక్టర్లతో ర్యాలీలను నిర్వహించడం వల్ల కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. వైరస్ ప్రబలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video