కేసీఆర్ని ఇవ్వమందాం: డిగ్గీ, బీజేపీకే వదిలేద్దాం: బాబు
హైదరాబాద్: మెదక్ లోకసభ స్థానాన్ని తమకు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కోరాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ శనివారం జిల్లా నేతల వద్ద ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారట.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, మాజీ విప్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కిష్టా రెడ్డి తదితరులతో గాంధీ భవన్లో డిగ్గీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్ లోకసభ స్థానాన్ని తమకే వదిలేయాలని లేదా బలహీనమైన అభ్యర్థిని నిలిపి తమ గెలుపుకు సహకరించాలనే ప్రతిపాదనను తెరాస ముందుకు తేవాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
తెరాస అంగీకరించని పక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తామని డిగ్గీ అన్నారు. కాగా, మెదక్ బరిలో కాంగ్రెసు నేతలు.. సునితా లక్ష్మా రెడ్డి, దామోదర సతీమణి పద్మినీ రెడ్డి, మాజీ ఎంబీ బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, మరో మైనార్టీ నేత పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. మెదక్లో తనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని జగ్గారెడ్డి తెలిపారు.
బీజేపీకే వదిలేద్దాం: టీటీడీపీ నేతలకు బాబు
గత ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చిన మెదక్ లోకసభ స్థానాన్ని ఈ ఉప ఎననికల్లో వారికే వదిలేయాలని భావిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు శనివారం చెప్పారు. పార్టీ నేతలతో చంద్రబాబు మెదక్ ఎన్నికపై చర్చించారు. పోటీ చేద్దామని పలువురు నేతలు సూచించారు. అయితే, బీజేపీ గట్టిగా కోరితే సీటు వదిలేయాల్సి ఉంటుందని చంద్రబాబు వారితో చెప్పారు.