చంద్రబాబుకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆహ్వానం : రేపు కీలక ఘట్టం..!?
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు లేఖ రాసారు. రేపు శ్రీనగర్ సభకు హాజరు కావాలని కోరారు.
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. బీజేపీ తమకు టీడీపీ-వైసీపీతో పొత్తులు ఉండవని తేల్చి చెప్పింది. తెలంగాణలో బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదే సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్దిగా ఉన్న కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి ఒక ఆహ్వానం అందింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలుగా ఉన్నవారికి కాంగ్రెస్ ఈ ఆహ్వాన లేఖలు పంపింది. రేపు శ్రీనగర్ వేదికగా కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. మరి..టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానం పైన ఏం చేయబోతోంది...

టీడీపీతో సహా 23 పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ లేఖలు
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ముగియనుంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగింపు వేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని వ్యతిరేకిస్తూ..తమతో సఖ్యతగా ఉన్న 21 పార్టీలను ఆహ్వానిస్తూ లేఖలు రాసింది. అందులో టీడీపీకి లేఖ రాసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
మమతా బెనర్జీ, నితీశ్, స్టాలిన్, ఉద్దవ థాక్రే, అఖిలేష్ యాదవ్, మాయావతితిలో పాటుగా హేమంత్ సోరెన్..అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసారు. యాత్ర ముగింపు సభ ద్వారా లక్ష్యాలను.. సందేశాన్ని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లేలా కలిసొచ్చే పార్టీలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పుకొచ్చింది. కానీ, టీడీపీ ఈ సభకు దూరంగా ఉండనుంది.

నాడు కాంగ్రెస్ కు దగ్గరగా.. నేడు దూరం
2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా రాహుల్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేసారు. మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు పార్టీలతో సమావేశమయ్యారు.
మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. కానీ, 2019 ఎన్నికల్లో ఇటు ఏపీలో చంద్రబాబు ఓడిపోవటం.. అటు కేంద్రంలో తిరిగి మోదీ అధికారంలోకి రావటంతో చంద్రబాబు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
కాంగ్రెస్ తో నాడు చేతులు కలపటం చారిత్రక తప్పిదం గా పార్టీ సీనియర్లు పలు సందర్భాల్లో వాపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీతో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేస్తోంది.

ఎన్నికల వేళ మరోసారి పొత్తుల పై చర్చ
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ వామపక్షాలతో.. ఏపీలో వైసీపీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగటానికి నిర్ణయించాయి. బీజేపీ పొత్తులు ఉండవని చెబుతోంది. టీడీపీ -జనసేన పొత్తు ఏపీకే పరిమితమా..రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందా అనే అంశం పైన కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీతో కలవకపోతే వామపక్ష పార్టీలు ఏపీలో టీడీపీ - జనసేన తో కలుస్తాయా... కొత్తగా ఏపీలో ఎంట్రీ ఇస్తున్న బీఆర్ఎస్ తో కలిసి ముందుకెళ్తాయా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ తో ఇతర పార్టీలు కలిసే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో..ఎన్నికల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications