మోసగాళ్లు: ఢిల్లీలో మోడీ-బాబులపై 420 కేసు పెట్టాలని ఫిర్యాదు, ఢిల్లీలో టీడీపీ-వైసీపీ పోటాపోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. పార్లమెంటు బయటా, వెలుపల నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలు తెలిపింది.
బడ్జెట్ తొలి సమావేశాల్లో వైసీపీ, కాంగ్రెస్లపై టీడీపీ పైచేయి సాధించింది. దీంతో ఇప్పుడు మూడు పార్టీలు పోటాపోటీగా ఉద్యమిస్తున్నాయి. పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ సభలో అడ్డుకుంటోంది. వైసీపీ ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ అలా అన్నారు, పవన్ జవాబు చెప్పాలి: విజయసాయి, మోడీని ఇరుకున పెట్టొద్దని జగన్!
Recommended Video
ఏపీసీసీ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులపై పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హోదా సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. విభజన చట్టాన్ని రూపొందించినప్పుడే హోదా ఇస్తామని చెప్పామన్నారు. విభజన హామీలపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి మోసం
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తక్కువ కాలం ఇచ్చిందని, తాము పదిహేనేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని రఘువీరా రెడ్డి అన్నారు. హోదా ఇస్తామని మోడీ, చంద్రబాబులు తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇప్పుడు మోసం చేశారన్నారు.
మోసగాళ్లుగా మిగిలిపోయారు
హోదాపై ప్రజలకు వాగ్ధానం ఇచ్చి, సభలో తీర్మానం చేసి మోసం చేశారని చంద్రబాబు, మోడీలపై రఘువీరా మండిపడ్డారు. ఇద్దరు కూడా మోసగాళ్లుగా మిగిలిపోయారన్నారు. మోడీ ప్రధానిగా ప్రమాణం చేసిన అయిదు రోజుల్లోనే విభజన హామీలు అమలు చేసేలా చూడాలని తాము సోనియాకు లేఖ ఇచ్చామన్నారు.
విభజన జరిగిన చోటే వారిపై 420 చీటింగ్ కేసు
ఎక్కడైతే విభజన జరిగిందో, ఎక్కడైతే ఏపీకి అన్యాయం జరిగిందో అదే పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేశామని రఘువీరా అన్నారు. చంద్రబాబు, మోడీలపై ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం చీటింగ్ కేసు పెట్టాలని తాము కోరామన్నారు. ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీలు డ్రామాలు ఆడుతున్నారన్నారు.
సభలో మోడీ కాంగ్రెస్ ఉసురుపోసుకునే మాటలు
ప్రత్యేక హోదా కోసం కడుపు మండిన ఏపీ ప్రజలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయని రఘువీరా రెడ్డి అన్నారు. బడ్జెట్లో అన్యాయం జరిగిందని తాము చెబితే.. ప్రధాని మోడీ కాంగ్రెస్ ఉసురు పోసుకునే మాటలు సభలో మాట్లాడారని, అలాంటి మోసగాడు అన్నారు. సీఎం చంద్రబాబుకు ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. చివరకు గవర్నర్ స్పీచ్లో కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు.
అమిత్ షా ఇంట్లో భేటీ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కోసం
ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఇంట్లో భేటీ జరుగుతోందన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచితే చాలు మీతో కలుస్తామని టీడీపీ చెబుతోందన్నారు. హోదా, ఏపీకి ప్రయోజనాలు చంద్రబాబుకు అవసరం లేదన్నారు. సీట్లు పెంచితే అందరికీ టిక్కెట్లు ఇవ్వవచ్చునని చెప్పారు.
బీజేపీ నేతతో మాట్లాడా, టీడీపీని లొంగదీసుకునేందుకు
ఈ రోజు తాను ఓ సీనియర్ బీజేపీ నేతతో మాట్లాడానని, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారని రఘువీరా అన్నారు. హోదాపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు. టీడీపీ లొంగిపోతోందని, బీజేపీ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. అందుకే ఈ మోసగాళ్లు మోడీ, చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. హోదానే తమకు ముఖ్యమన్నారు.
బరితెగించారు, బీజేపీ-టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని
మోసం చేస్తామని బరితెగించి ఎప్పుడైతే వారు చెబుతున్నారో, అప్పుడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అర్హత ఏర్పడిందని రఘువీరా అన్నారు. బీజేపీ, టీడీపీల గుర్తింపు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తామని చెప్పారు. పార్లమెంటులో వెంకయ్య, జైట్లీ విభజన సమయంలో ఏం మాట్లాడారో అన్నీ రికార్డులు ఉన్నాయన్నారు. వెంకయ్య అప్పుడు సన్మానాలు కూడా చేయించుకున్నారన్నారు. తాము అన్ని ఆధారాలను పోలీస్ స్టేషన్లో ఇచ్చామని చెప్పారు.