చంద్రబాబుకు రాహుల్ గాంధీ షాక్: పొత్తుపై తేల్చేసిన కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ఎంట్రీతో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ బుధవారం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ, పార్టీ ఏపీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొత్తుల విషయంలో తమ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమది ఒంటరి పోరు అని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
టీడీపీతో పొత్తు లేదు
ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు లేదని తెలిపారు. అంతకుముందు, ఆయన ఏపీ కాంగ్రెస్ నేతల నుంచి టీడీపీతో పొత్తుపై అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం చాందీ మాట్లాడారు. ఏపీలో తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. 13 జిల్లాల్లో బస్సుయాత్రపై మరోసారి చర్చిస్తామన్నారు. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 1వ తేదీన మరోసారి చర్చిస్తామన్నారు.
ఏ పార్టీతోను లేదు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 1వ తేదీన తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండదని ఇప్పటికే చెప్పారని, టీడీపీతో సహా ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలిపారు., ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోకసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జనసేన పొత్తు కోసం ఆహ్వానించిన చంద్రబాబుకు షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఓడిపోయారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబుతో పొత్తు వద్దని ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పడంతో.. టీడీపీకి షాకిచ్చారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే పొత్తులపై నిర్ణయం తీసుకున్నారు.
ప్రియాంక గాంధీతో ఇందిరమ్మ గాలులు
రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ ఎంట్రీతో మరోసారి ఇందిరమ్మ గాలులు వీస్తాయన్నారు. తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి విభజన హామీలు అమలవుతాయని రఘువీరా రెడ్డి చెప్పారు. కాగా 13 జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై మళ్లీ చర్చించనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయనున్నారు.