బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా ఉన్న బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ హైకమండ్ గట్టి షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్తిబాబుని వెంటనే బహిష్కరించాలని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి రఘవీరారెడ్డికి శుక్రవారం ఉదయం ఫోన్లో సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కని విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో చాలా మంది తెలుగుదేశం, వైసీపీల్లో చేరిపోయారు. అయితే రఘవీరా, మరికొంతమంది సీనియర్లు మాత్రం ఇంకా అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. జూన్ 7న బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులు, అనుచరగణంతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
దీనిపై సమగ్ర సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, బొత్స పార్టీని వీడేలోగానే తామే బహిష్కరిస్తే బాగుంటుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ చేరడంతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాలీ అయినట్లే.
డీసీసీ నేతలు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కూడా రద్దుచేశారు. దానికున్న బోర్డును తొలగించేశారు. మొత్తం డీసీసీ కార్గవర్గంతోపాటు అన్ని మండల శాఖల కార్యవర్గాలు కూడా రాజీనామా చేసి లేఖలను పీసీసీకి ఫాక్స్లో పంపామని డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిళ్లా విజయ్కుమార్ స్పష్టంచేశారు.
తామంతా ఈ నెల 7న బొత్సతోపాటు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని చెప్పారు. బొత్స ఎటు వెళ్తే తామూ అటేనని ఇదివరకే ప్రకటించామని పిళ్లా తెలిపారు. కాగా ఈ నెల 7న బొత్సతోపాటు సుమారు 200 మంది నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
బొత్స తప్పు చేశారు, అందుకే సస్పెండ్: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ ఇంత పని చేస్తాడని అనుకోలేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. బొత్స సస్పెన్షన్పై పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న రఘవీరారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి బొత్స పెద్ద తప్పుచేశారని అన్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం వల్లనే బొత్సపై సస్పెన్షన్ వేటు వేయక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న అంశంపై స్పందించిన రఘవీరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహావృక్షమని, ఎవరు వీడినా పార్టీకి నష్టం లేదని పేర్కొన్నారు.