పార్టీ కష్ట కాలంతో ఉంది, బలోపేతం చేయాలి: దిగ్విజయ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. గాంధీభవన్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరాభవన్ను శనివారం దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఏపిసిసి కార్యకలాపాలు ఇందిరాభవన్ నుంచి కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి, కిల్లి కృపారాణి, ఎంపీలు కెవిపి, సుబ్బిరామిరెడ్డి, మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పిపిసి చీఫ్గా పొన్నాల లక్ష్మయ్య, ఏపిసిసి చీఫ్గా రఘువీరారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాల్లో బలోపేతం చేయడంతోపాటు రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రెండు పిసిసిల ఏర్పాటుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధం: సిపిఐ
ప్రస్తుతం తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం విజయవాడలో జరగనున్న ఆ పార్టీ ఎన్నికల కమిటీ భేటీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.