తెలంగాణకు కేంద్రం తీపికబురు.. రూ.7,597 కోట్లతో రెండు జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రవాణా రద్దీని తగ్గించి, జిల్లాల మధ్య అనుసంధానతను పెంచేందుకు వీలుగా రెండు భారీ జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.
రూ. 7,597 కోట్ల అంచనా వ్యయంతో రెండు జాతీయ రహదారులు
మొత్తం రూ. 7,597 కోట్ల అంచనా వ్యయంతో, సుమారు 190 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారులను నాలుగు వరుసల మార్గాలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద విస్తరించబోయే మొదటి రహదారి ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల NH-63. ఈ మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM పద్ధతిలో నిర్మించనున్నారు. ఇది నిజామాబాద్, జగిత్యాల మరియు మంచిర్యాల జిల్లాల మీదుగా సాగుతుంది.

బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
రెండవది జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారి NH-563. దీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ BOT విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను గతంలోనే పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అత్యాధునిక ప్రమాణాలతో డిజైన్
ఈ కొత్త రహదారులను గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక ప్రమాణాలతో డిజైన్ చేశారు. ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఎదుర్కొంటున్న అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల, గంగాధర మరియు పోతారం వంటి ప్రధాన పట్టణాల పరిధిలో బైపాస్ రోడ్లను నిర్మిస్తారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే ఆర్మూర్ నుండి మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది.
ఈ మార్గాల్లో తగ్గనున్న ప్రయాణ సమయం
జగిత్యాల నుండి కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల మేర కలిసిరానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎం గతిశక్తి' మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఈ రెండు హైవే ప్రాజెక్టులను రూపొందించారు. ఈ కొత్త రోడ్డు మార్గాల ద్వారా తెలంగాణ పరిధిలోని 5 ప్రధాన ఆర్థిక కేంద్రాలు, 7 సామాజిక కేంద్రాలు, మరియు 8 కీలక లాజిస్టిక్ కేంద్రాలు నేరుగా అనుసంధానం కానున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతాల్లో వాణిజ్యం, రవాణా రంగం వేగంగా పుంజుకోవడమే కాకుండా, స్థానికంగా ఉన్న పరిశ్రమలకు కొత్త ఊపు లభిస్తుంది.













Click it and Unblock the Notifications