హోదాపై ఇప్పుడు టైం వచ్చింది: పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు ప్రత్యేక హోదా పైన ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పుడు వారు పెదవి విప్పాలని కాంగ్రెస్, విద్యార్థి జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి జయంత్ సిన్హా బుధవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
ఈ సందర్భంగా వారు బిజెపితో పాటు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. బిజెపికి, వెంకయ్య నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఏపీని మోసం చేసిందని భగ్గుమంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మోడీ, వెంకయ్య, పవన్ కళ్యాణ్లు ఎన్నో మాటలు చెప్పారని, హోదా లేదంటూ చేసిన ప్రకటనపై ఇప్పుడు వారు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మోడీ మాట ఇచ్చారని, నిన్నటి బీజేపీ ప్రకటన సిగ్గుచేటన్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం, సమయం వచ్చిందన్నారు. హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ మెతక వైఖరి అవలంబిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తుందని చెప్పారు. కాగా, హోదాపై పవన్ ఇటీవల ఒకింత సాఫ్టుగా స్పందించిన విషయం తెలిసిందే.
మొహం చాటేస్తున్న బిజెపి నేతలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కొందరు మొహం చాటేస్తున్నారు. మూడు రోజులుగా బీజేపీ నేతలు పెద్దగా మీడియా ముందుకు రావడం లేదని అంటున్నారు. ఒకరిద్దరు నేతలు చర్చల్లో, మీడియా ముందుకు వస్తున్నా.. ముఖ్య నేతలు రావడం లేదని అంటున్నారు. బిజెపి పేరు చెప్పి ఏ నాయకుడు జనం ముందుకు వచ్చినా వారిని నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది.