నాపై రెండు హత్య కేసులు: దేవినేని, అక్రమంగా కేసులు పెడుతున్నారు: నాని
అమరావతి: తాను నెహ్రూ, గాంధీని కాదని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రు అన్నారు. కాల్మనీ వ్యవహారంపై సోమవారం ఆయన విజయవాడలో మాట్లాడారు. కాల్ మనీ ముఠాతో సంబంధమున్న టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే వ్యక్తిత్వం తనది కాదన్నారు. తనపై దెబ్బ పడితే దాని కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. తనపై రెండు హత్య కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. బెజవాడలో బాంబుల సంస్కృతి లేదని చెప్పిన ఆయన ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఉండే అవకాశం ఉందన్నారు.
తనకు ఎలాంటి ప్రైవేటు సైన్యం లేదని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని విమర్శించిన ప్రతి ఒక్కరూ కళంకితులేనని ఆయన తెలిపారు. కావాలంటే తాను నిరూపించగలనని ఆయన సవాల్ విసిరారు.
అక్రమంగా కేసులు పెడుతున్నారు: పేర్ని నాని
బందరు పోర్టు భూముల కోసం పోరాడుతున్న నేతలను మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కొట్టడంతో పాటు అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఈ విషయమై సోమవారం జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జనచైతన్య యాత్రలో భాగంగా కరగ్రహారం గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించినప్పుడు ఆ గ్రామ సర్పంచి కళ్యాణి భర్త ఫరీద్ పోర్టు భూముల గురించి నిలదీశారని తెలిపారు. దీనిపై మంత్రి అనుచరులు అతనిపై దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించారన్నారు.
అక్రమ కేసుల్లో తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని కోరారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేటప్పుడు పేర్ని నాని వెంట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పలువురు వైసీపీ నేతలు, రైతులు ఉన్నారు.