బెజవాడ కల్తీమద్యం కేసు: ముందస్తు బెయిల్ కోసం మల్లాది విష్ణు పిటిషన్
అమరావతి: విజయవాడలోని కృష్ణలంకలోని స్వర్ణబార్లో జరిగిన కల్తీమద్యం కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందుస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టులో మల్లాది విష్ణు తరుపున అతని న్యాయవాది ఈ పిటిషన్ను దాఖలు చేశాడు.
ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్వర్ణబార్లో మద్యం సేవించిన కారణంగానే ఐదుగురు చనిపోగా, 29 తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బార్ యజమానులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.
మల్లాది విష్ణు తల్లి బాల త్రిపుర సుందరమ్మని విచారించేందుకు సిట్ అధికారులు నోటీసు కూడా పంపారు. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. కాగా స్వర్ణ బార్ నిర్వహణను తానే చూస్తున్నట్లు విష్ణు తమ్ముడు తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
స్వర్ణబార్ మల్లాది విష్ణు తమ్ముడి పేరుమీద ఉండటం, ఆయన తల్లి బాల త్రిపుర సుందరమ్మకు వాటా ఉన్న నేపథ్యంలో వారి పేర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు ఏఫ్ఐఆర్లో చేర్చారు.
ఆ మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లాది విష్ణు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. కాగా మల్లాది విష్ణుని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న భావనతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్కు బయల్దేరి వెళ్లింది. మరోవైపు మల్లాది విష్ణుకు సంబంధించిన సెల్ ఫోన్ కాల్స్ ఒరిస్సాలోని కటక్ నుంచి వచ్చినట్లు విశ్వసమీయ సమాచారం మేరకు మరో బృందం రెండు రోజుల క్రితమే అక్కడికి బయల్దేరి వెళ్లింది.
ఇది ఇలా ఉంటే కల్తీ మద్యం కేసులో కీలకమైన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇంకా విజయవాడ పోలీసులకు అందలేదు. ఈ ఫోరెన్సిక్ నివేదిక వస్తే కేసు ఒక కొలిక్కి వస్తుంది. బుధవారం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక అందవచ్చని పోలీసులు భావిస్తున్నారు.