కాంగ్రెసుకు షాక్: సైకిలెక్కనున్న సీనియర్ నేత మహమ్మద్ జానీ
గుంటూరు జిల్లాలో కాంగ్రెసుకు షాక్ తగలబోతోంది. సీనియర్ నేత మహమ్మద్ జానీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
గుంటూరు: గుంటూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీకి షాక్ తగలబోతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న జానీ టిడిపిలో చేరడం కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగించే పరిణామమే.
చంద్రబాబుతో పాటు పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుతో జానీ చర్చలు జరిపారు. తాజాగా బుధవారం ఉదయం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ నాయకులు మద్ధాళి గిరిధర్, దాసరి రాజా మాష్టారు, షేక్ షౌకత్, జాగర్లమూడి శ్రీనివాసరావు, మీరావలి తదితరులు బారా ఇమాంపంజాలోని జానీ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ చోటు కల్పించింది. వరుసగా జియావుద్దీన్పై రెండుసార్లు జానీ ఓటమి పాలు కావడంతో 2004లో నంబూరు సుభానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయినప్పటికీ జాని పార్టీకి సేవలందిస్తూ వచ్చారు. 2007లో జానీని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చింది.రెండోసారి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయన పదవీకాలం కొద్ది రోజుల్లో ముగుస్తుంది.
కాగా, 2004లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని దెబ్బ తింది. ఆ ఎన్నికల్లో జియావుద్దీన్పై 36 వేల పైచిలుకు ఓట్లతో నంబూరు సుభాని గెలుపొందారు. అప్పటి నుంచి గుంటూరు తూర్పులో టీడీపీ కోలుకోలేకపోయింది. 2009లోనూ జియావుద్దీన్ ఓటమి పాలయ్యారు.
2014లో మైనార్టీ అభ్యర్థిని కాకుండా మద్ధాళి గిరిధర్కు టిక్కెట్ ఇచ్చింది. అయినా కూడా వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా గెలుపొందారు. ఈ నేపథ్యంలో జానీ ప్రవేశం తూర్పు నియోజకవర్గంలో టిడిపి పుంజుకుంటుందని భావిస్తున్నారు.