జనసేనకు చిరంజీవి విరాళం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త ట్విస్ట్ తీసుకుంటోంది. ఎన్డీఏ మూడు పార్టీల కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా కనిపిస్తున్న ఎన్నికల యుద్దం కాంగ్రెస్ - వామపక్షాల కూటమి పోటీతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. జనసేనాని పవన్ ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారుతున్నారు. జనసేన కు తాజాగా మెగాస్టార్ చిరంజీవి రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. దీని పైన కాంగ్రెస్ స్పందించింది. కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చింది.
చిరంజీవి విరాళంతో
మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. నేరుగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పకపోయినా...పార్టీకి విరాళం ద్వారా పరోక్షంగా తన మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలోనే చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేసారు. అదే సమయంలో పవన్ ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా పవన్ తన సోదరుడు నాగబాబుతో సహా పెద్దన్నయ్య చిరంజీవి కలిసారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

కాంగ్రెస్ లోనే ఉన్నారా
దీని ద్వారా చిరంజీవి ఆశీస్సులు పవన్ కు ఉన్నాయనేది ఎన్నికల వేళ స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేతలు స్పందించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాజాగా పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు. తమ కోసం ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే, తమ్ముడు పార్టీ కారణంగానే చిరంజీవి విరాళం ఇచ్చారనేది వారి వాదన. అయితే,చిరంజీవికి కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదనే విషయాన్ని ఆ నేతలు గుర్తు చేస్తున్నారు.

జనసేనకు ప్రచారం చేస్తారా
చిరంజీవి ప్రస్తుతం ఆలిండియా కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేతలు చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నా..ఎక్కడా చిరంజీవి రాజకీయంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. జనసేనకు చిరంజీవి ప్రచారం చేసే అవకాశం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతగా ఉంటూ జనసేనకు విరాళం ఇవ్వటం పైన ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదే సమయంలో కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేసిన తరవాత ఆయన ఏం చేసినా స్పందించాల్సిన అవసరం ఉండదనే వాదన కాంగ్రెస్ లో వినిపిస్తోంది. దీంతో..ఇప్పుడు చిరంజీవి వీటి పైన స్పందిస్తారా .. ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications