కాంగ్రెసు లింక్: కెసిఆర్కు చిరంజీవి భయం?
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే బొంత పురుగునైనా ముద్దాడుతానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తానని కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలకు కెసిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు నిర్ణయం తీసుకుని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియపై వేగంగా ముందుకు కదులుతున్న ప్రస్తుత తరుణంలో కెసిఆర్ డైలమాలో పడినట్లు చెబుతున్నారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించడానికి, తెరాసను తమ పార్టీలో విలీనం చేయడానికి కాంగ్రెసు అధిష్టానం పెద్దలు లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. తెరాసను విలీనం చేసిన తర్వాతనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తామని కాంగ్రెసు పెద్దలు కెసిఆర్తో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. పార్టీని విలీనం చేసే విషయంలోనే డైలమాలో ఉన్న కెసిఆర్ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన తర్వాత విలీనంపై ఆలోచన చేస్తామని కెసిఆర్ చెబుతూ వస్తున్నారు. తెరాస నాయకులు కూడా ఆ మాటే చెబుతున్నారు. దానికితోడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమ పార్టీ ఉంటుందని వివిధ సందర్భాల్లో చెబుతున్నారు. దీంతో తెరాస విలీనంపై కాంగ్రెసు అధిష్టానానికి అనుమానాలు తలెత్తినట్లు చెబుతున్నారు. దాంతో కెసిఆర్పై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఒత్తిడి పెడుతున్నట్లు చెబుతున్నారు.
ఒక వేళ విలీనం చేయాల్సి వస్తే బేషరతుగా అందుకు సిద్ధపడడానికి కూడా కెసిఆర్ సిద్ధంగా లేరని అంటున్నారు. తమ పార్టీకి చెందినవారికి ఏ విధమైన ప్రాధాన్యం ఇస్తారో తేల్చుకున్న తర్వాతనే అందుకు అంగీకరించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దానికితోడు, కెసిఆర్ను మరో భయం కూడా పీడిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత కేంద్రంలో మంత్రి పదవి లభించినప్పటికీ చిరంజీవి ప్రాభవం తగ్గిపోయిందని, తెరాసను విలీనం చేసిన తర్వాత తన ప్రాభవం కూడా తగ్గుతుందని ఆయన భయపడుతున్నట్లు చెబుతున్నారు. అందువల్ల విలీనం చేయకుండా కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడితే ప్రాధాన్యం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి కెసిఆర్కు అభ్యంతరం లేకపోయినప్పటికీ విలీనం విషయంలోనే ఆయన డైలమాలో పడినట్లు చెబుతున్నారు.
ఇందులో మరో రాజకీయ కోణం కూడా ఉంది. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే మరో ప్రత్యర్థి పార్టీ ముందుకు వస్తుంది. అటువంటి స్థితిలో కాంగ్రెసు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు రావచ్చు. సమైక్యాంధ్ర నినాదంతో మొత్తంగానే తెలంగాణను వదిలేసినందు వల్ల ఇప్పట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ అవకాశం ఉండదు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తెలుగుదేశం పార్టీకి వెసులుబాటు లభిస్తుంది. తెరాస, కాంగ్రెసు విడివిడిగా ఉండి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీని నామమాత్రం చేయవచ్చునని కూడా కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.