'ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్.. కాంగ్రెస్లోని కొందరి ప్లాన్': రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విహెచ్ నో
హైదరాబాద్: పార్టీకి నష్టం చేసే వాళ్ల సంగతి చెబుతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. కొందరు పనిగట్టుకొని పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రచార కమిటీలో చోటు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిటీ నియామకాల్లో తప్పులు జరిగాయని చెప్పారు.
తప్పులు ఉంటే వేలెత్తి చూపాలని దివంగత రాజీవ్ గాంధీ చెప్పారని వి హనుమంత రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెండు తెలుగు రాష్ట్రాలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని చెప్పారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించను
లోకల్ లీడర్లే హైకమాండ్ను తప్పుదోవ పట్టించారని వీహెచ్ ఆరోపించారు. ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వకపోయినా తాను రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రచారం చేస్తానంటే ఎందుకు వినడం లేదన్నారు. కాంగ్రెస్లోని కేసీఆర్ కోవర్టుల పేర్లు రాహుల్ గాంధీకి ఇస్తానని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు.

ఎవరికి బలముందో తెలుసుకోవాలి
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు కమిటీల నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీలో పని చేసే వారికి గుర్తింపు లేదని, కమిటీల్లో ప్రాధాన్యత లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్లందరికీ కమిటీలో స్థానం కల్పించారన్నారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. ప్రజల్లో బలమున్న నేతలకు ప్రాధాన్యం లభించలేదన్నారు. ప్రజల్లో ఎవరికి బలముందో తెలుసుకోవాలన్నారు.

మీరుండాల్సింది ఇక్కడ కాదు
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. కార్యకర్తలను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకొని చూసుకుంటుందని చెప్పారు. అభ్యర్థుల విషయం అడగ్గా.. అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తుందని, ఎవరికి అన్యాయం జరగదని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తలు ఉండాల్సింది ఇక్కడ కాదని నియోజకవర్గాల్లో అన్నారు.

ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించదు
ఇదిలా ఉండగా, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు. తెలుగుదేశం, కమ్యూనిస్ట్ సహా పలు పార్టీలతో పొత్తుతో కలిసి వెళ్తోంది. దానికి తోడు పార్టీలో గ్రూపులు ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రకటిస్తే నష్టం జరిగే అవకాశముందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించదు.












Click it and Unblock the Notifications