ఎన్టీఆర్ ను దింపేందుకు కాంగ్రెస్ కు అస్త్రం, రంగా హత్యతో టిడిపికి వ్యతిరేకంగా దాసరి ప్రచారం
సినీ నటుడు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చింది దర్శకరత్న దాసరినారాయణరావు.
హైదరాబాద్: సినీ నటుడు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావాలని సలహా ఇచ్చింది దర్శకరత్న దాసరినారాయణరావు. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి అధికారంలోకి వచ్చారు.అయితే ఎన్టీఆర్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ దాసరిని రంగంలోకి దింపింది.
సినీరంగంలో దాసరి అందరివాడుగా ముద్రపడ్డాడు. అయితే ఆయనను సినీ పరిశ్రమలోని అన్నివర్గాలు అక్కునచేర్చుకొన్నాయి.ఏ కష్టంవచ్చినా కాని దాసరికి చెప్పుకొంటే చాలనే అభిప్రాయం ఉంది. దాసరి కూడ తన వద్దకు వచ్చి సమస్యలను చెబితే వాటిని పరిష్కరించేవారు.
తన మనసులో ఉన్నమాటను నిర్మోహమాటంగా వెల్లడించేవారు.అయితే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. రాజీవ్ గాంధీ అంటే ఆయనకు ఇష్టం.
రాజీవ్ ప్రేరణతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే టిడిపికి వ్యతిరేకంగా దాసరి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు.సామాజిక స్ఫృహ ఉన్న సినిమాల్లో ఎన్టీఆర్ నటించి పేరు ప్రఖ్యాతలు సాధించాడు.అయితే ఆయనకు ఎక్కువగా ప్రజల్లో పేరు సాధించిపెట్టిన సినిమాలు దాసరి దర్శకత్వం వహించినవే కావడం గమనార్హం.
ఎన్టీఆర్ కు సలహాచ్చి, ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ప్రచారం
సర్ధార్ పాపారాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజాసేవకు తాను సమయాన్ని కేటాయించనున్నట్టు ప్రకటించారు.ఈ సినిమా షూటింగ్ సందర్భంగా బావితరాలు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలని దాసరిని ఎన్టీఆర్ ప్రశ్నిస్తే ప్రజాసేవ చేయాలని ఆయన ఎన్టీఆర్ కు సూచించారు. అయితే తనను రాజకీయాల్లోకి రావాలని ప్రజల నుండి వస్తున్న ఉత్తరాలను దాసరికి చూపారు. ప్రజాసేవ చేయాలని దాసరి ఎన్టీఆర్ ను ప్రోత్సహించారు.ఈ షూటింగ్ గ్యాప్ లోనే ప్రజాసేవకు సమయాన్ని కేటాయించనున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటుచేశారు.అయితే ఎన్టీఆర్ నేతృత్వంలోని టిడిపికి వ్యతిరేకంగా దాసరి ప్రచారం చేయడం గమనార్హం.
ఎన్టీఆర్ ను ఢీకొట్టడానికి దాసరిని దింపిన కాంగ్రెస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిని దెబ్బకొట్టాలంటే సినీ రంగంలోని వ్యక్తులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.ఈ మేరకు దర్శకరత్న దాసరిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.దాసరి స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అభిమాని. అయితే 1980 దశకంలో రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 1989 ఎన్నికల్లో కాపునాడు ఉద్యమానికి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా దాసరి నారాయణరావు ప్రచారం చేశారు. అయితే 1989 లో రాజీవ్ గాంధీ మరణంతో కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
టిడిపి వ్యతిరేక ఓట్లు చీలుతాయని వెనక్కి తగ్గిన దాసరి
1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుగుతల్లి పేరుతో రాజకీయపార్టీని ఆయన ప్రారంభించారు.అయితే టిడిపి వ్యతిరేక ఓట్లు చీలుతాయని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితేవడంతో ఆయన వెనక్కితగ్గారు. 1996, 1998,1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గాను 2000 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభసభ్యత్వం ఇచ్చింది. ఎంపిగా ఉంటూనే ఆయన సినిమాలు తీశారు.
రంగా హత్యకు నిరసనగా కాంగ్రెస్ కు ప్రచారం
రాజకీయాల్లోకి దాసరి నారాయణరావు యాధృచ్చికంగానే వచ్చారు. అయితే నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అడిగితే ఇందిరాగాంధీ కమ్ బ్యాక్ అనే ఫీచర్ ఫిల్మ్ చేశారు దాసరి. రాజీవ్ గాంధీ పిలిచి విశ్వామిత్ర అనే సినిమా తీయాలని అడిగితే రామారావుతో పోటీపడి తీయడం కష్టమని దాసరి చెప్పారు. కాకపోతే అదే కాన్సెప్టుతో టీవి సీరియల్ తీశారు. విజయవాడకు చెందిన కాపు నాయకుడు రంగా హత్య తర్వాత స్వంత డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు.మరో వైపు 2004 ఆయనకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి పదవిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.