''పెద్దాయన''పై డోలాయమానంలో చంద్రబాబు?
ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో ఆయన మాట ఒక వేదవాక్కులా చెలామణి అయ్యేది. రాజకీయం చేయడంలో దిట్ట. కానీ కాలం కలిసిరాలేదు. అంతటి రాజకీయ నేత కూడా కొన్నాళ్లు కనుమరుగు కావాల్సి వచ్చింది. మళ్లీ వెలుగులోకి రావాలనుకుంటున్న సమయంలో ఎటు పయనించాలో అర్థంకాని అయోమయ స్థితి. ఆయనే.. డాక్టర్ దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. డీఎల్ రవీంద్రారెడ్డి అనే ఎక్కువగా పిలుస్తారు.

డీఎల్ కు మైదుకూరు పెట్టనికోట
కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం డీఎల్ కు పెట్టనికోట. 1978 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఆరుసార్లు ఘన విజయాలు సాధించారు. రెండుసార్లు మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోవడంతో ఆయన కూడా అజ్ఞాత వాసం పాటించాల్సి వచ్చింది. 2014, 2019 రెండు ఎన్నికల్లో మైదుకూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా డీఎల్ మద్దతు ఉండాల్సిందే. అంతగా ఈ నియోజకవర్గంతో ఆయన అనుబంధం పెనవేసుకుపోయింది. మైదుకూరు అంటే డీఎల్.. డీఎల్ రవీంద్రారెడ్డి అంటే మైదుకూరు.

రాజకీయంగా ఉనికిని చాటుకోవాలని..
ప్రస్తుతం రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలనే యోచనతో ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ ఆ పార్టీకి బలమైన అభ్యర్థిగా పుట్టా సుధాకర్యాదవ్ ఉన్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఒకవేళ తన కుమారుడికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే తాను ఇక్కడ పోటీనుంచి తప్పుకోమంటే శిరసా వహిస్తానని అధిష్టానానికి చెప్పారు. అంతేకాకుండా వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓటమిపాలైనవారికి టికెట్లు ఇచ్చేది లేదని మహానాడులోనే ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు డీఎల్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. ఆ తర్వాత కూడా అధిష్టానం దగ్గర గుర్తింపు దక్కలేదు. కడప జిల్లాలో సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న తనను కాదని బద్వేల్కు చెందిన గోవింద్రెడ్డికి, ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవులు దక్కడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.

ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి
కొంతకాలం ఓపిక పట్టినప్పటికీ వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని ఆయన అర్థమైంది. వివేకా హత్య కేసులో నిందితులెవరో జగన్కు తెలుసని, రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమిపాలవుతారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలనే యోచనతో ఉన్న డీఎల్ తెలుగుదేశం పార్టీతో రాయబారం నడిపారు. ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థిగా పుట్టా ఉండటంతో చంద్రబాబు డోలాయమానంలో పడ్డారు. కడప జిల్లాకు సంబంధించి ఇటీవల తాను నిర్వహించుకున్న సర్వేలో డీఎల్ రవీంద్రారెడ్డి అభ్యర్థి అయితే పార్టీ విజయం ఖాయమని వచ్చింది. ప్రస్తుతం అధికారికంగా డీఎల్ టీడీపీలోకి రాలేదు. భవిష్యత్తులో వస్తారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications