నాలుగు రాష్ట్రాల్లో ఢమాల్, టీ తేలిక్కాదు: లగడపాటి
న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో.. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలపై వేలాది సర్వేలు నిర్వహించామని, ఎన్నికలైపోయాయి కాబట్టి తమ సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టడం లేదని ఆయన చెప్పారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం దూకుడు తగ్గుతుందని, తెలంగాణ ఏర్పాటు అంత తేలిక కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను ఆపడానికి చాలా మార్గాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసువాదిగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బాధగానే ఉన్నప్పటికీ సమైక్యవాదిగా తనకు అనుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తమ సర్వేలో తేలిందని ఆయన తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇంకా తెలియదని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపి, కేజ్రివాల్ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆయన తెలిపారు. రేపటిలోగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని చెప్పారు. గతంలో కూడా తాము సూచాయగా ఎన్నికల ఫలితాలను ముందే ప్రకటించామని ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెడువడుతాయి కాబట్టి పార్లమెంటులో బలాబలాలు స్పష్టమవుతాయని చెప్పారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన కేంద్ర ప్రభుత్వం దూకుడు తగ్గుతుందని లగడపాటి తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కేంద్రం పనితీరులో ఒడిదుడుకులు వస్తాయని, కేంద్రం దూకుడు తగ్గి రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు.
మైనార్టీ ప్రభుత్వంలో మిత్రపక్షాల వ్యతిరేకమైన బిల్లును పాస్ చేయాలంటే కేంద్రానికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కూడా కేంద్రం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేకపోవచ్చని లగడపాటి చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి 228 ఎంపి సీట్లు ఉన్నాయని, అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మిత్రపక్ష పార్టీలపై ప్రభావితం చూపుతాయని తెలిపారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరులో మార్పు తీసుకువస్తుందని, దూకుడు తగ్గుతుందని లగడపాటి చెప్పారు. డిసెంబర్ 8 తర్వాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. సమైక్యం కోసం అనేక మార్గాలు, అస్త్రాలు తమ వద్ద ఉన్నాయని లగడపాటి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమి బాధ కలిగిస్తోందని ఆయన తెలిపారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుగు ప్రజలపై కూడా ఉంటుందని తెలిపారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా తమ ప్రభావాన్ని ఫలితాలపై చూపారని చెప్పారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వందల టిఎంసిల నీటి విషయం కాబట్టి సాగునీటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications