టిపై కుట్ర: కోదండరాం, బిల్లుపై చర్చ జరగాలన్న అశోక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకునేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కుట్ర జరుగుతోందని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షలో ఆయన మాట్లాడారు. సంపూర్ణ తెలంగాణ కోసమే ఈ దీక్షను చేపట్టినట్లు తెలిపారు. ముసాయిదా బిల్లుకు సవరణలు పెడితే ఓటింగ్ను ఆమోదించే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
గవర్నర్ నుంచి శాంతిభద్రతల అధికారాన్ని తొలగించాలని కోదండరాం డిమాండ్ చేశారు. విభజన అనంతరం ఉమ్మడి హైకోర్టు కాకుండా రెండు హైకోర్టులు ఉండేలా సవరణలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోదండారం కోరారు. శాసనసభ అభిప్రాయాలు తెలిపేందుకే ముసాయిదా బిల్లు సభకు వచ్చిందని ఆయన అన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై చర్చను అడ్డుకోవడం సరికాదని కోదండరాం అన్నారు. మ్యాచ్ ఎప్పుడో అయిపోయిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని బంతులు ఆడినా ప్రయోజనం లేదని ఆయన అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.
శాసనసభలో సీమాంధ్ర సభ్యులకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరిపేందుకు ఇష్టం లేకపోతే వెంటనే పార్లమెంటుకు బిల్లును పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లును పార్లమెంటుకు పంపాలని ఆయన రాష్ట్ర గవర్నర్, స్పీకర్ను కోరారు. సభలో సభ్యులు అమర్యాద ప్రవర్తిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెండు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాగా బుధవారం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
చర్చ జరిగితే విభజన అంగీకరించినట్లు కాదు: అశోక్ బాబు
సీమాంద్ర ప్రజాప్రతినిధులు విభేదాలు పక్కన పెట్టి తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు సహకరించాలని ఏపిఎన్జివో అధ్యక్షుడు అశోక్ బాబు కోరారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదని అన్నారు. బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర సమైక్యతకు భంగం కలిగితే ఆయా పార్టీలదే బాధ్యత అని అశోక్ బాబు తేల్చి చెప్పారు.
ఫిబ్రవరి 10 లోపు సమైక్యవాదానికి అనుకూలంగా గ్రామ సభల తీర్మానాలను రాష్ట్రపతికి పంపుతామని అశోక్ బాబు వెల్లడించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంపై రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.