పండుగ వేళ బిగ్ షాక్ - భారీగా పెరిగిన వంట నూనెల ధరలు..!!
సామాన్యులకు వంట నూనెలు భారంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా వంట నూనెల ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలను సాకుగా చెబుతూ వంట నూనె వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దిగుమతుల పేరుతో పలు రకాల నూనెల ధరలను పెంచి విక్రయాలు చేస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఈ రకంగా వంట నూనెల ధరలు పెరగటం సామాన్యులకు సమస్యగా మారుతోంది.
వంటనూనెల ధరలు సంక్రాంతి సమీపిస్తున్న సమయంలో క్రమేణా పెరుగుతున్నాయి. సరఫరా తక్కువగా ఉందన్న వాదనలను తెరపైకి తెస్తూ ఏజెన్సీలు ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్స్ దిగుమతిపైనే ఆధారపడి ఉంటాయి. మలేషియా, రష్యా, ఉజ్బెకిస్తాన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది. రూపాయి విలువలో చోటు చేసుకుంటున్న మార్పులే ఈ పరిస్థితికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో డాలర్లలో మనమేమీ డబ్బు చెల్లించట్లేదు. రూపాయిల్లోనే చెల్లిస్తున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు అవకాశమే లేదు. మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలంతా సన్ఫ్లవర్ ఆయిల్స్ లో ఎక్కువగా ఫ్రీడమ్, ఫార్చ్యూన్, గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకెట్లను వినియోగిస్తారు.

వీటి ధరలు రెండు నెలల క్రితం ఎమ్మార్పీ రూ.185 ఉండగా, ప్రస్తుతం కూడా అదే కొనసాగు తోంది. ఈ ఎమ్మార్పీపైనే సెప్టెంబరులో ఫ్రీడమ్ ఆయిల్ రూ.140, గోల్డ్ డ్రాప్ రూ.135కు విక్రయించారు. ప్రస్తుతం కూడా ఎమ్మార్పీ రూ.185లే ఉండగా, హోల్ సేల్ వ్యాపారుల వద్ద మాత్రం ఫ్రీడమ్ ఆయిలు రూ.153కు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో కూడా ఇంచుమించు అదే ధరను ప్రదర్శిస్తున్నారు. సెమీ హోల్ సేల్ వ్యాపారులు రూ.155కు విక్రయిస్తున్నారు. రిటైల్లో ఇదే ఫ్రీడమ్, ఫార్చ్యూన్ ఆయిల్స్ రూ.160పైనే ఉన్నాయి. మండల, గ్రామీణ స్థాయిలో ఇంకా పెంచే విక్రయిస్తున్నారు. మొత్తంగా సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్లపై రూ.10 నుంచి రూ.15 వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఏజెన్సీలు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెరుగుతున్న వంట నూనెల ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications