రాజమండ్రిలో కరోనా కల్లోలం ... జూనియర్ కాలేజీలో 175 మంది విద్యార్థులకు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రిలోని తిరుమల ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది.
మాస్కులు లేకుండా తిరిగితే జరిమానాల వీర బాదుడు ... కరోనా కంట్రోల్ కి ఏపీలో పోలీస్ మార్క్ కొరడా
జూనియర్ కళాశాల హాస్టల్లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 585 కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే తిరుమల ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తెలుస్తుంది . ఇక వారందరికీ కాలేజీ హాస్టల్ లోని ఐసోలేషన్ ఏర్పాటుచేసి ప్రభుత్వ వైద్యులు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇక ఈ రోజు విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి మంత్రి చెల్లుబోయిన వేణు అధికారులతో మాట్లాడారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థుల పరిస్థితి , వైద్య సేవలను అడిగి తెలుసుకున్న మంత్రి చెల్లుబోయిన వేణు
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే కేసులు ఇదేవిధంగా పెరిగిపోతాయని వెల్లడించారు. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లబ్దం ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి వేణు అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు , కాలేజీలు, బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కఠిన ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం స్కూళ్లు ,కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతుంది. స్కూళ్లు కళాశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. సామాజిక దూరం నిబంధనలు పాటించాలని,మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మాస్కులు ఉంటేనే స్కూళ్ళు, కళాశాలలకు అనుమతించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది . అయితే గతంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించిందో ఆ జిల్లాలలోనే ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.