ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు: జూన్ 20 వరకు, 144 సెక్షన్ యధాతథం
అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Recommended Video
ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ యధాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 9వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కొత్త కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య మాత్రం కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,511 నమూనాలను పరీక్షించగా.. 8766 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 8766 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది మృతి చెందారు. చిత్తూరులో అత్యధికంగా 11 మంది మరణించగా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశంలో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 11,696కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,292 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,64,082కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి.