సంక్రాంతి సంబరాలపై కరోనా నీళ్ళు చల్లుతుందా? మొదలవుతున్న ఆంక్షల అర్ధం అదేనా?
సూర్యుడు కర్కాటకరాశి నుండి మకరరాశిలో ప్రవేశించే పర్వదినం మకర సంక్రాంతి శుభదినం. ఇక ఇదే రోజు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అలాంటి సంక్రాంతి పర్వదిన వేడుకలు తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలతో, బసవన్నల ఆటలతో, ముత్యాల ముగ్గులతో, ముగ్గుల్లో గొబ్బిళ్ళతో, రకరకాల పిండివంటలతో, పిల్ల జెల్లా, పెద్ద చిన్న , ముసలి ముతక, ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.
సంక్రాంతి పండుగపై కరోనా ఎఫెక్ట్
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. ఆటపాటలతో, ఉత్సవాలలో మునిగి తేలతారు.ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఇంతింత అన్ని వర్ణించడానికి వీలుకాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు కోడి పందాలు, ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక అటువంటి సంక్రాంతి పండుగ శోభ ఈ సంవత్సరం కనిపిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి.. అలెర్ట్ అంటున్న కేంద్రం
విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తెలుగు రాష్ట్రాలు ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న పరిస్థితులలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో ఆంక్షలు విధించాలని పదే పదే హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసులు పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఊహించని విధంగా పెరుగుతున్న కేసులు కొత్త ఆందోళనకు కారణంగా మారాయి.
కరోనా సమయంలో కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహించుకోవడం కష్టమే
ఈ సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం, కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహించుకోవడం, బంధు మిత్రులతో కలిసి సరదాగా గడపడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఏ రూపంలో ఎవరి ద్వారా కరోనా మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం ఈ సమయంలో కరోనా మహమ్మారి పై ఏ విధమైన భయాలు అయితే ప్రజల్లో ఉన్నాయో, ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాప్తికి కారణంగా మారుతుంది.
సొంత ఊర్లకు చేరుకుంటున్న వారి హడావిడి .. అయినా పండుగపై ఆందోళనే
దీంతో వ్యాక్సిన్ తీసుకున్నామన్న భరోసా కూడా జనాలకు లేకుండా పోతుంది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సమయంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తీరు పండుగను బాగా జరుపుకోవాలని ఆశిస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సొంత ఊర్లకు చేరుకునే వారి హడావిడి కనిపిస్తుంది కానీ వారు పండుగ ఘనంగా జరుపుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్ధకమే.
ఏపీలో మొదలైన నైట్ కర్ఫ్యూ.. కఠిన ఆంక్షలు .. సంక్రాంతి సంబరాలపై అనుమానం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలు, వేడుకలు ఉత్సవాలు నిర్వహించడానికి వీలులేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.ఈ సమయంలో వచ్చిన సంక్రాంతి పండుగ అనేక ఆంక్షల మధ్య, కరోనా భయాల మధ్య ఘనంగా జరుపుకోవడం కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.