ఈ ఉగాదికి కరోనాతో సహజీవనమే .. సింపుల్ గా ఉగాది, ప్లవ నామ సంవత్సరంలోనూ వదలని మహమ్మారి !!
తెలుగు వారి పండుగ ఉగాది . కొత్త ఆశలు, కొంగొత్త లక్ష్యాలతో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదికి స్వాగతం పలకాలని చాలా ఆశగా ఎదురు చూసిన ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ఏడు కరోనా బాధలు తప్పటం లేదు. ప్లవ నామ సంవత్సర ఉగాది కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది . గత ఏడాది ఉగాది కరోనా వల్ల చేదు రుచితో మొదలైంది , ఈ ఏదైనా తీపి రుచిని ఆస్వాదించి సుఖ సంతోషాలతో జీవనం సాగించాలి అనుకుంటే ఈ ఏడు కూడా కరోనా రక్కసి వదల్లేదు.
హర్యానాలో నైట్ కర్ఫ్యూ .. వీరికే మినహాయింపు , కరోనా కట్టడికి హర్యానా సర్కార్ కీలక నిర్ణయం
శార్వరిలో ప్రారంభమైన కరోనా ప్లవ నామ సంవత్సరంలోనూ కొనసాగింపు, కరోనా అంతం కావాలని కోరిన సీఎం జగన్
శ్రీ శార్వరి నామ ఉగాదితో కరోనా అంతం అవుతుంది అనుకున్నా, అలా కాకుండా ప్లవ నామ సంవత్సరానికి కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది . ఈ ప్లవ నామ సంవత్సరం లో అయినా గత ఏడాది తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు అనుభవంగా మొదలైనా , కరోనా నివారణ జరిగి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండి తీపి జ్ఞాపకంగా మిగలాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా, కరోనా ఈ ఏడు అంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు .
తెలంగాణాలో కరోనా కారణంగా నిరాడంబరంగా ఉగాది వేడుకలు
ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు . కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణా రాష్ట్రంలోనూ నిరాడంబరంగా ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు . హైదరాబాద్ బొగ్గులకుంట లోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో కమిషనర్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అతిథిగా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి విశిష్ట అతిథిగా ఈ వేడుకలకు హాజరు అయ్యారు. కరోనా వ్యాప్తి నేపద్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు.
తెలుగువారి తొలి పండుగ .. కరోనా కేసుల తీవ్రతతో ఈ ఏడు ఆందోళనగానే
తెలుగు వారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారి తొలి పండుగగా భావించేది ఉగాది . ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించాలని, ఈ సంవత్సరమంతా సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మామిడి పూత పరిమళాలతో, కోకిల కిలకిల రావాలతో వసంత రుతువులో స్వాగతిస్తారు. తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది ఈ సారి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పరిస్థితి లేదు. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో పండుగ సంతోషం మాట అటుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది .
కేసుల పెరుగుదల నేపధ్యంలో కరోనానిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాల్సిందే
ఈ ఏడు కూడా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరికి వారు ఇంటికి పరిమితమై పండుగను నిర్వహించుకోవలసిన పరిస్థితి. ఆకులు రాలే శిశిరానికి వీడ్కోలు పలికి వసంత రుతువును ఆహ్వానిస్తూ జరుపుకునే ఉగాది పండుగ నాడు అందరం కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని భావిస్తాం కానీ పంచాంగ శ్రవణం వినటానికి గుంపులుగా ఒకచోట కూడి ఉండకండి అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలోనే ఈ ఉగాదికి కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు .