మందు కోసం కరోనా బాధితులు రావొద్దు: ఆనందయ్య, రెండ్రోజుల్లో పంపిణీ, అవసరమైతే ఇంటి వద్దకే..
నెల్లూరు: కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన వనమూలికలను ఆయన శిశ్యులు సిద్ధం చేస్తున్నారు. మరో ఐదారు రోజుల్లోగా మందు పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది.
Recommended Video
కరోనా పాజిటివ్ ఉన్నవారు మందు కోసం రావద్దన్న ఆనందయ్య
అయితే, కరోనా పాజిటివ్ ఉన్నవారు మాత్రం ఎవరూ కూడా తన మందు కోసం రావద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తానని తెలిపారు. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానని చెబుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం సోమవారం పంపిణీకి అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
కంట్లో వేసే మందుకూ అనుమతివ్వాలంటున్న ఆనందయ్య
కంట్లో వేసే మందుకు మినహా మిగితా మందుకు సీసీఆర్ఏఎస్ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే చుక్కల మందుపై ఇంకా నివేదిక రాలేదు. అందుకు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఐ డ్రాప్స్కు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య కోరుతున్నారు. చుక్కల మందుపై నివేదిక వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. నివేదికను గురువారం అందించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం తయారు చేయదు
ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్ధారణ కానప్పటికీ.. హాని లేదని నివేదికలు తేల్చడంతో హైకోర్టు, ఏపీ సర్కారు పంపిణీకి అనుమతులు ఇచ్చాయి. ఆనందయ్య మందు పంపిణీలో కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు కోసం కరోనా బాధితుల బంధువులు మాత్రమే రావాలని సూచించింది. డాక్టర్లు ఇచ్చిన మందులతోపాటు ఆనందయ్య మందును వాడుకోవచ్చని తెలిపింది. ఆనందయ్య మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ.. అది ఆయుర్వేద మెడిసిన్ కాదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తయారు చేసే అవకాశం లేదన్నారు. ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదన్నారు. హెల్త్ సప్లిమెంట్గా మాత్రమే వాడుకోవచ్చని తెలిపారు.
అవసరమైతే ఇళ్ల వద్దకే ఆనందయ్య మందు పంపిణీ..
కృష్ణపట్నంలో ఆనందయ్యను కలిసి అభినందించారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి ఊరటనిచ్చిందన్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదం పట్ల అపారమైన అనుభవం ఉండటంతోపాటు ఆయన మందు పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం గమనించి అండగా నిలిచామని తెలిపారు. త్వరలో ప్రభుత్వ అనుమతి మందు పంపిణీ జరుగుతుందని, అవసరమైతే ఇళ్ల వద్దకు కూడా మందు చేరే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.