ఒక్క రోజులో 26 కేసులు, ఏపీలో 190కి చేరిక: రెడ్ జోన్లుగా ఆ ప్రాంతాలు, మోడీ పిలుపుపై జగన్ ఇలా
అమరావతి: కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తోంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఉదయం 180 కేసులు నమోదు కాగా, తాజాగా మరో 10 కేసులు నమోదయ్యాయి.

ఒక్క రోజే 26 కేసులు.. 190కి చేరిక
శనివారం ఒక్కరోజే 26 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. తాజాగా నమోదైన కేసులను జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే.. కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు చొప్పున నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో 400లకుపైగా అనుమానితుల రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది.

రెడ్ జోన్లుగా ఆ ప్రాంతాలు..
ఇది ఇలావుండగా, కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులు ఉన్న ప్రాంతాలను పోలీసులు రెడ్ జోన్గా ప్రకటించి అటువైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏపిలో ఇప్పటి వరకు నమోదైన బాధితుల జాబితాలో పేషెంట్ నెంబర్ 41 నుంచి పేషంట్ నెంబర్ 130 వరకు గల వ్యక్తుల నివాస స్థలాల వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీని వల్ల స్థానిక ప్రజలు ఆ ప్రాంతాలవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ సీఎం సహాయనిధికి సత్యసాయి ట్రస్ట్ భారీ విరాళం..
కరోనాపై పోరాటం కోసం సత్యసాయి ట్రస్ట్ తనవంతుగా ఏపీ ప్రభుత్వానికి సాయాన్ని అందించింది. ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కరోనా నివారణా చర్యలకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని ట్రస్ట్ కోరింది. పెన్నా సిమెంట్స్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించగా, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ. 1 కోటి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశాయి.

మోడీ పిలుపుపై జగన్ ఇలా..
జీతాల కోత విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ మార్చి నెలలో సగం జీతం ఇచ్చి, మిగిలినది మరో వాయిదాలో చెల్లించాలని నిర్ణయించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహం అందించేందుకు వారికి పూర్తి జీతాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications