ఏపీలో కరోనా ఉధృతి: కోవిడ్ కంట్రోల్ కోసం మరోమారు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. రోజుకు ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు
ఏపీలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది . అంతేకాదు 21 మంది ఐఏఎస్ , ఐపీఎస్, ఐ ఆర్ ఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర ,మల్లికార్జున్ , శ్రీకాంత్ ,పీయూష్ కుమార్, బాబు. ఏ, విజయరామరాజు , అభిషేక్ మహంతి వంటి అధికారులకు స్థానం కల్పించింది.
ప్రతి జిల్లాకు టాస్క్ ఫోర్స్ .. జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేకాధికారులు
కరోనా వ్యాప్తి జరగకుండా నివారణ చర్యలకు ,కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి పర్యవేక్షణకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టిన ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,086 కరోనా కొత్త కేసులు నమోదు కావడం 14 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం ఏపీలో తాజా కరోనా పరిస్థితిని చెప్పకనే చెబుతుంది.
ఇప్పటివరకు లాక్ డౌన్ ఆలోచన లేని ఏపీ సర్కార్ .. స్కూళ్ళు, కాలేజీలు యధావిధిగా
ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, పాక్షిక లాక్ డౌన్ వైపు నిర్ణయాలు తీసుకుంటున్న వేళ, ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం ఇప్పటివరకు లాక్ డౌన్ ఆలోచన చేయకపోవడం గమనార్హం. స్కూళ్ళు , కాలేజీలను కూడా యధావిధిగా కొనసాగిస్తుంది. ఇక పరిస్థితి ఇలానే ఉంటే మరింత తీవ్రంగా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ కరోనా కేసుల కట్టడికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం పని మొదలు పెట్టింది. గతంలోనే ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలలో కరోనా నిబంధనలను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కట్టడికి ఇప్పటికే నిబంధనలను అమలు చెయ్యాలని ఆదేశాలు
మార్కెట్లలో,షాపింగ్ మాల్స్ లో, పరిశ్రమలలో భౌతికదూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలి అని, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. ఇక క్యాంటీన్లు, డైనింగ్ హాల్స్, హోటల్స్ లో ప్రతి రెండు గంటలకు శానిటైజేషన్ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని , ఏపీ వాసులకు కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది ఏపీ సర్కార్.