కరోనా వ్యాక్సిన్ ఇప్పటికి రాలేదు .. ఇక ముందు రాదు : బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా వ్యాక్సిన్ విషయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రాలేదు.. అసలు వ్యాక్సిన్ రాదు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఎలాగైనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని వివిధ ఫార్మా కంపెనీలు యుద్ధప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
Recommended Video
ఇండియాలో గత 24 గంటల్లో 30,548 కరోనా కొత్త కేసులు .. భారీగా తగ్గిన కేసుల వెనుక కారణం ఇదే !!
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ పై వ్యాఖ్యలు
వ్యాక్సిన్ వస్తే కొంతమేర కరోనా వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్న వేళ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ రాలేదని, ఇక ముందు కూడా రాదని చేసిన వ్యాఖ్యలు షాక్ కు గురి చేస్తున్నాయి. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తల్లో నిజం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిదని, కరోనా నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా వ్యాప్తి జరగకుండా మన వంతు ప్రయత్నం చేయాలని బాలయ్య తెలిపారు.
కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే
కరోనా మన జీవితాంతం ఉంటుందని, దానితో మనం సహజీవనం చేయాల్సిందేనంటూ పేర్కొన్న బాలకృష్ణ విర్గో పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న సెహరి సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన సందర్భంగా పేర్కొన్నారు.
కరోనా సమయంలో చదువుకున్న వారికి, చదువులేని వారికి తాను ఎన్నో సూచనలు చేశానని, కార్తీక మాసం కదా అని ఎవరూ చన్నీళ్లతో తలస్నానం చేయొద్దని బాలయ్య పిలుపునిచ్చారు. కరోనా నిమోనియాకి సంబంధించిందని, అది ఒక లిపిడ్ ప్రోటీన్ అని, పరివర్తన చెందుతూ ఉంటుందని పేర్కొన్నారు బాలయ్య.
కార్తీకమాసం చన్నీళ్ళతో తలస్నానం మంచిది కాదన్న బాలయ్య
కరోనా గురించి తనకు తెలుసని కరోనా మనిషి మనసును కన్ఫ్యూజ్ చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. కార్తీకమాసం అయినప్పటికీ ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పిన బాలకృష్ణ వేడి నీళ్లతో స్నానం చేయాలని, వేడినీళ్లతో ఆవిరి పట్టాలని, ఉప్పు వేసి వేడి నీళ్లను పుక్కిలించాలి అని చెప్పారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తే బాగుంటామని పేర్కొన్న బాలకృష్ణ చన్నీళ్ళతో స్నానం చేస్తే అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కరోనా ఇప్పుడప్పుడే పోదని తేల్చి చెప్పారు. కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ చేస్తున్న సినీ యూనిట్ ను ఆయన అభినందించారు.