రఘురామ విషయంలో దారుణంగా, కేసీఆర్లా జగన్ బయటికి రావాలి: సోము వీర్రాజు, కన్నా విమర్శలు
అమరావతి: కరోనా మహమ్మారి కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. కడపలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఏపీ బడ్జెట్లో కరోనా కట్టడికి నిధులేవీ?: సోము వీర్రాజు
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వ్యాప్తి కట్టడలో రాస్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. కరోనా కట్టడికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా కట్టడికి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా కట్టడిలో ఏపీ సర్కారు విఫలమైందన్న కన్నా
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కరోనా నివారణ, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆదివారం గుంటూరులోని తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ రెండు గంటలపాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కరోనాను సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించినా.. బెడ్స్ ఏర్పాట్లు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

కేసీఆర్లా జగన్ కూడా బయటికి రావాలి..
కరోనా వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోడీ 35వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని అన్నారు. కరోనాతో ప్రజలు పడే ఇబ్బందులను తెలుసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా ఏపీ సీఎం జగన్ కూడా తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని కన్నా విమర్శించారు. వైసీపీ మద్దతు లేని ఆస్పత్రులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

రఘురామకృష్ణరాజు విషయంలో దారుణంగా..
ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశంపై సర్కారుకు రాష్ట్ర బీజేపీ కూడా మద్దతిస్తోందన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లను మార్కెట్లో విక్రయిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని కన్నా విమర్శించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, ఫలితాల విషయంలో చేతులెత్తేసిందన్నారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సమయంలో కూడా చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారని కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో తేలిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రఘురామ వ్యవహారంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు. తప్పులు ఎత్తిచూపి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడతారా? అని కన్నా ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications