coronavirus: 3 కి.మీ పరిధిలో 141 మంది వైద్య పరీక్షలు, కలెక్టర్లతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్..
కరోనా వైరస్పై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మక్కా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అతని కుటుంబ సభ్యులు, పరిసరాలకు చెందిన వ్యక్తులకు కూడా పరీక్షలు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరస్ గురించి వదంతులు వ్యాప్తి చేయొద్దని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముట్టుకుంటేనే..
కరోనా వైరస్ గాలి ద్వారా సోకదని.. ఈ విషయంపై మీడియా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. వైరస్ సోకిన వ్యక్తిని తాకితే లేదంటే తుంపిర్ల ద్వారా మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. వైరస్పై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలన్నారు. రాష్ట్రంలో వైరస్కు సంబంధించి ప్రతీ విషయాన్ని మీడియాకు తెలియజేస్తామని పేర్కొన్నారు. వైరస్ గురించి విషయాన్ని దాయాల్సిన అవసరం లేదని.. ప్రతీరోజు ఉదయం 8 గంటలకు బులెటిన్ విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
కలెక్టర్లతో సమీక్ష..
వైరస్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్షిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన వ్యక్తి 3 కిలోమీటర్ల పరిధిలో తనిఖీలు చేపడుతామని తెలిపారు. 141 టీమ్స్ 7 వేల 50 ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్య బృందంలో ఆశ వర్కర్, ఏఎన్ఏం, సచివాలయ ఉద్యోగి ఉంటారని తెలిపారు.
విశాఖ వృద్దుడికి..
విశాఖపట్టణానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఆయన ఇటీవల మక్కా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. అతనికి వైరస్ సోకిందని విశాఖ జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. ప్రస్తుతం అతనిని చెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో ఇదివరకు నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొ కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 119 శాంపిళ్లు పరీక్షించగా ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 104 శాంపిళ్లు నెగటివ్గా తేలాయి. మరో 12 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.