కరోనా ఎఫెక్ట్ : ఇంకా తేలని విదేశీయుల లెక్క- భయం గుప్పిట్లో ఏపీ- జల్లెడ పడుతున్న వాలంటీర్లు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటున్న తరుణంలో మళ్లీ భయాలు మొదలయ్యాయి. మొన్న రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 7 కాగా.. నిన్న మళ్లీ ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విదేశాల నుంచి తామర తంపరగా వచ్చిన ప్రయాణికులే ఇందుకు కారణం. తొలుత రాష్ట్రానికి విదేశాల నంచి వచ్చిన వారిని ప్రభుత్వం గుర్తించిన సంఖ్యకు, తాజాగా బయటపడుతున్న కేసులకూ పొంతన లేకపోవడంతో క్వారంటైన్ నుంచి తప్పించుకున్న వారి ఘనకార్యాలు వెలుగుచూస్తున్నాయి.
తప్పిన విదేశీయుల లెక్క..
విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన 12 వేల 500 మంది ప్రయాణికులను విమానాశ్రయాల నుంచి నేరుగా క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు గత వారం ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ వెల్లడించారు. ఆ తర్వాత రోజే కేంద్రం జనతా కర్ఫ్యూ పేరిట అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. అంటే ఇప్పటివరకూ రాష్ట్రానికి చేరుకున్న విదేశీ ప్రయాణికుల సంఖ్య 12 నుంచి 13 వేల మధ్యనే ఉండాలి. కానీ తాజాగా ప్రభుత్వం చెబుతున్న విదేశీ ప్రయాణికుల సంఖ్య 13 వేలు దాటిపోయింది. దీంతో అనుమానాలు మొదలయ్యాయి.
ఆందోళనలో ఏపీ సర్కార్..
విదేశాల నుంచి నేరుగా ఏపీలోని విమానాశ్రయాలకు వచ్చిన వారిని నేరుగా కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ కు పంపారు. వీరిలో నెగెటివ్ గా తేలిన వారిని ఇళ్లకు కూడా పంపేశారు. కానీ ఏపీలో విమానాశ్రయాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు వచ్చి అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్రానికి చేరుకున్న వారి సంఖ్య ఇప్పుడు తేలడం లేదు. వీరిలో కొందరిని గుర్తించి క్వారంటైన్ కు పంపినా మిగతా వారి లెక్క మాత్రం తేలడం లేదు. దీంతో ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది. అయితే వీరి గుర్తింపు కోసం రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయం తీసుకుని ఇంటింటి సర్వే చేపడుతున్నారు.
జబ్బు ముదిరాక ఆస్పత్రులకు రాక...
ఇలా ప్రభుత్వం కళ్లు గప్పి ఇళ్లకు చేరుకున్న విదేశీ ప్రయాణికుల్లో ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇంట్లో ఉండి కరోనా లక్షణాలు కనిపించడంతో చికిత్స కోసం తొలుత వీరు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడి నుంచి వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అప్పుడు వీరు చెబుతున్న వివరాలు ఇప్పుడు డాక్టర్లతో పాటు ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరికొందరు పారాసిటమాల్ మాత్రలు వేసుకుని, విదేశాల నుంచి రాగానే ధర్మల్ స్కానింగ్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. వీరికి కూడా క్రమంగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.
విదేశీయుల లెక్క తేలితే కానీ..
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆస్పత్రుల్లో క్వారంటైన్ పొందుతున్న వారితో పాటు ప్రభుత్వం కళ్లుగప్పి ఇళ్లకు వెళ్లిపోయిన వారిలో ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారేమో తేలడానికి మరో వారం రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వీరి ద్వారా కరోనా ప్రబలిన స్ధానికులు ఎవరైనా ఉంటే వారి గుర్తింపు కూడా ఈ లోగా సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏదేమైనా
మరో వారం రోజులు గడిస్తే కానీ ఇళ్లలో ఉండిపోయిన కరోనా బాధితుల సంఖ్య తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఆ సంఖ్య గుర్తింపు పూర్తయ్యాకే ఏపీలో కరోనా వాస్తవ పరిస్దితిపై స్పష్టత రానుంది.
Recommended Video