లాక్డౌన్ ఆదేశాలు పాటించని ప్రజలకు క్లాస్ పీకిన యమధర్మరాజు చిత్రగుప్తా..ఎక్కడో తెలుసా..?
కర్నూలు: అటు ప్రపంచంలో ఇటు దేశంలో కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే దేశం లాక్డౌన్లోకి వెళ్లగా... చాలామంది లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదు. తొలుత పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు పోలీసులు ప్రజలను అర్థిస్తున్నారు. తమకు తోచిన పద్దతిలో చెబుతున్నారు.
కొన్ని చోట్ల పోలీసులు పాటలతో కరోనావైరస్ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తుండగా మరికొన్ని చోట్ల ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ బయటకు రావొద్దని వేడుకుంటున్నారు. ఇలాంటిదే ఒక ఘటన కర్నూలులో కనిపించింది. లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి యదేచ్ఛగా వస్తున్న ప్రజలకు పోలీసులు వినూత్న పద్దతిలో బయటకు రావొద్దని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు రోడ్డుపై కనిపిస్తే లాఠీలకు పనిచెప్పిన పోలీసులు... ఇప్పుడు వివిధ వేషధారణలతో ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్నారు. తాజాగా డోన్ పోలీసులు యమధర్మరాజు మరియు చిత్రగుప్త గెటప్లు ధరించి రోడ్డుపైకొచ్చిన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

" నాపేరు యమధర్మ రాజు.. ఇక్కడకు నేను ఎందుకు వచ్చానో తెలుసా..? డోన్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అందుకే పైనుంచి కిందకు దిగి వచ్చాను." అంటూ చెప్పుకొచ్చారు. ఇక వారి నాటకంలో భాగంగా ఎంతమంది నిబంధనలు ఉల్లంఘించారో లెక్కబెట్టాల్సిందిగా చిత్రగుప్తుడికి ఆదేశాలు ఇచ్చారు యమధర్మరాజు. అంతేకాదు వారి మరణానికి తేదీ ఫిక్స్ చేయాల్సిందిగా చిత్రగుప్తుడిని కోరారు యమధర్మరాజు. దీని తర్వాత ఇంట్లో ఉండటం వల్ల చేకూరే మేలులను వివరించారు. అవగాహన తీసుకొచ్చారు. కోవిడ్-19పై పోరుకు ఒక్కటే చికిత్స అని అది ఇళ్లల్లో ఉండటమే అని చెప్పారు. అంతేకాదు సామాజిక దూరంను కూడా తప్పనిసరిగా పాటించాలని వెల్లడించారు.
Recommended Video
ఇక కోవిడ్-19 కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని చెప్పిన పోలీసులు, ప్రజలు నిబంధనలను పాటించకుంటే ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలిన కోరారు. ఇదిలా ఉంటే ఏపీలో కేసులు 111గా నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మతకార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే కావడం విశేషం.












Click it and Unblock the Notifications