లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు.. ఆరు నుంచి 9వ తరగతి వరకూ..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైస్కూలు విద్యార్దులను ఎలాంటి పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్దితి లేకపోవడం, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా మొగ్గుచూపింది.
పరీక్షలు లేకుండా ప్రమోట్ అయ్యేది వీరే..
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలలో పరీక్షలు నిర్వహించే పరిస్దితి లేనందున 6,7,8,9 తరగతులు చదువుతున్న విద్యార్ధులను నేరుగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ లో వీరికి వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా భయాలతో స్కూళ్లు మూతపడటం, సిలబస్ పూర్తి కాకపోవడం, పరీక్షలు నిర్వహించే పరిస్దితి లేకపోవడంతో ప్రభుత్వం అసాధారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో..
కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 14 వరకూ కేంద్రం లాక్ డౌన్ విధించడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్ర్రాలు 6 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్ధులకు పరీక్షలు రద్దు చేసేశాయి. వారిని నేరుగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. ఇదే విషయాన్ని ఇవాళ విద్యాశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో జగన్ మన రాష్ట్రంలోనూ అదే విధానం పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.
భవిష్యత్ పరీక్షల దృష్ట్యా కేవలం 10వ తరగతికి మాత్రమే కామన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆ షెడ్యూల్ కూడా రెండుసార్లు వాయిదా పడింది. వాస్తవంగా ఈ నెల 31వ తేదీతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని రెండు వారాలు వాయిదా వేశారు.