ఏపీ సర్కారు మొండి వైఖరి వీడాలి: కరోనా కేసులు పెరుగుతున్నా అంటూ నాదెండ్ల మనోహర్ ఫైర్
అమరావతి: కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఆందోళనకరంగా ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్కు దూరదృష్టి లేదని విమర్శించారు.
ఏపీ సర్కారు బాధ్యత ఉందా?: నాదెండ్ల మనోహర్
విద్యా సంస్థలను కనీసం జనవరి నెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ నుంచి కాపాడుకోగలమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. కేసులు పెరిగితే చూద్దామని చెప్పడం విద్యాశాఖ మంత్రి బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదనే విషయం అర్థమవుతోందని ధ్వజమెత్తారు. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసి ఆన్లైన్ విధానంలో తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ విద్యార్థుల క్షేమం కోసం సెలవులు పొడిగించాయని అన్నారు. జాగ్రత్తలు తీసుకునే వైద్య కళాశాలల్లోని విద్యార్థులే కోవిడ్ బారిన పడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సర్కారు మొండి దోరణి విడిచిపెట్టాలన్న నాదెండ్ల మనోహర్
విద్యా సంస్థలు తెరవాలి, పరీక్షలు నిర్వహించాలనే మొండి దోరణి విడిచిపెట్టి విద్యార్థుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. కాగా, రోజుకి 4 వేలకుపైగా కొత్త కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 16.28శాతం నుంచి 19.65 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని విస్మరించవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించడం రిస్క్ అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్.
స్కూల్స్ తెరవడం సమంజసమా?: నాదెండ్ల ప్రశ్నలు
ఏపీ విద్యాశాఖ మంత్రి- వ్యాక్సిన్లు ఇస్తున్నాం కాబట్టి స్కూల్స్ తెరుస్తాం అంటున్నారు. 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ మన రాష్ట్రం కంటే మహారాష్ట్రలో ఎక్కువ మందికి వేశారు. అక్కడే విద్యా సంస్థలను మూసివేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొనే వైద్య కళాశాలల్లోని విద్యార్థులే కోవిడ్ బారినపడుతున్నారు. మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో భౌతిక దూరం అమలు చేయడం లేదు. పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. అలాంటప్పుడు స్కూల్స్ తెరవడం సమంజసమా? అని మనోహర్ ఏపీ సర్కారును నిలదీశారు. ఇప్పటికిప్పుడు విద్యా సంస్థలు తెరవాలి.. పరీక్షలు నిర్వహించాలనే మొండి ధోరణిని విడిచిపెట్టి విద్యార్థుల సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ మరోసారి డిమాండ్ చేశారు.