ఏపీలో 162కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ ఎమ్మెల్యేకు లాక్డౌన్ వర్తించదా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 162కు చేరింది. ఏపీలో ఒక కరోనా మరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
కరోనా లాక్ డౌన్ వర్తించదా..
ఓ వైపు ఏపీలో కరోనా పాజటివ్ కేసులు పెరుగుతున్నా కొందరు ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రావడం లేదు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలను చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ ఉల్లంగించారు. వీ. కోటలో కొత్తగా నిర్మించిన కల్వర్టును అట్టహాసంగా ప్రారంభించారు. సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. ఈయన మాత్రం మందీమార్బలంతో వెళ్లి ప్రారంభోత్సవం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించి.. మీడియాపై చిందులు..
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మెల్యే 50 మంది అనుచరులతో కలిసి వెళ్లి కల్వర్టును ప్రారంభించారు. ఇక సామాజిక దూరాన్ని కూడా వారెవరూ పాటించలేదు. కాగా, వెంకటయ్య గౌడ్ తీరుపై వార్తలను ప్రసారం చేసిన మీడియాపైనా ఆయన చిందులు తొక్కడం గమనార్హం. అంతేగాక, మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంకటయ్య గౌడ్ వ్యవహారశైలిపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.
Recommended Video
తెలంగాణతోపాటు దేశంలో పెరిగిన కేసులు
కాగా, తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా, 75 కేసులు పెరగడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనాసోకి కోలుకున్న వారిలో 15 మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2, 547కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 62 మంది మరణించారు. 2322 యాక్టిక్ కేసులున్నాయని తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 60వేలకు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షల దాటాయి.