4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకీ రేవంత్ రెడ్డి, కానీ షరతులు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ న్యాయస్థానం నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి శుక్రవారం నాడు అనుమతించింది. ఇందుకు ఏసీబీ అధికారులకు షరతులను విధించింది.
నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం.. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి న్యాయస్థానం సమక్షంలో విచారించాలని షరతును విధించింది.
తొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు రేవంత్ రెడ్డిని న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని సూచించింది. రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వీరిని శనివారం నుండి నాలుగు రోజుల పాటు అధికారులు విచారిస్తారు.
కాగా, అంతకుముందు రేవంత్ బెయిల్ పైన, అలాగే కస్టడీ పైన న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. బెయిల్ పైన విచారణ 9వ తేదీకి వాయిదా పడింది. కస్టడీకి మాత్రం నాలుగు రోజులు ఇచ్చింది. రేవంత్ తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారించాలి. చర్లపల్లి జైలులో లేదా ఏసీబీ కార్యాలయంలో లేదా మరోచోట విచారించవచ్చు.
అంతకుముందు...
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రేవంత్ తీసుకు వచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాల్సి ఉందని, రూ.4.5 కోట్ల వివరాలు కూడా తెలియాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ కోర్టుకు విన్నవించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎవరెవరిని కొనేందుకు ప్రయత్నించారో తెలియాల్సి ఉందన్నారు. చాలామంది ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిగాయని చెప్పారు. రేవంత్ కాల్ డేటా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సతీష్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి టార్గెట్ అని, ఆయనను పక్కా ప్రణాళికతో ఇరికించారని చెప్పారు. రేవంత్ ఎపిసోడ్కు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు విషయాన్ని చెప్పారన్నారు.
రేవంత్ రెడ్డిని కస్టడీకి ఇస్తే అతని ప్రాణాలకు ముప్పు అని చెప్పారు. రేవంత్ను ఏసీబీ గత నెల 31వ తేదీన అదుపులోకి తీసుకొని, రోజంతా విచారించిందన్నారు.
మే 28న ఏసీబీ అధికారులకు సమాచారం ఉన్నా మే 31 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. కస్టడీకి ఇస్తే రేవంత్ ప్రాణాలకు ముప్పు అన్నారు. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న నాలుగు అంశాలపై స్పష్టత లేదన్నారు. కాల్ రికార్డుల సేకరణకు రేవంత్తో పనేమిటని ప్రశ్నించారు.