షాక్: సుజనా చౌదరి అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ
హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరిపై గురువారం అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మారిషస్ బ్యాంక్ కేసులో వరుసగా మూడు వాయిదాలకు హాజరు కానందున ఆయనపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టు వారెంట్ జారీచేసింది.
తాను కోర్టుకు హాజరు కాకపోవడం ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పని కాదని సుజనా చౌదరి చెప్పారు. తనకు కోర్టులపై గౌరవం ఉందని చెప్పారు. పని ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల తాను గతంలో కోర్టుకు హాజరు కాలేకపోయానని చెప్పారు. తనకు కోర్టు వారంట్ జారీ చేయడంపై ఆయన గురువారంనాడు స్పందించారు.
ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. సుజనా చౌదరి రూ.106 కోటలు ఎగవేశారని ఆరోపిస్తూ మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మారిషస్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు కేసులో తాను కోర్టు ఎదుట హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టిడిపి ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మార్చి 22వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు.
సుజనా చౌదరికి మరో షాక్: 'రుణాల ఎగవేత'లో కోర్టుకు రావాల్సిందే
ఇటీవల మారిషస్ బ్యాంకు కేసులో సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్కు చెందిన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజనా, ఎండీ జీ శ్రీనివాస రాజు, డైరెక్టర్ హనుమంత రావు మార్చి 22వ తేదీ మంగళవారం కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. దీనిపై వారు మినహాయింపు కోరారు. సుజనా చౌదరి మినహా, మిగతా నిందితులు మంగళవారం కోర్టు ముందు హాజరయ్యారు.
నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ జి శ్రీనివాసరాజు, డైరెక్టర్ ఎస్ హనుమంతరావులు హాజరయ్యారు. సుజనా చౌదరి పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉన్నందున కోర్టుకు రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానియల్ రూథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుజనాచౌదరి హాజరు మినహాయింపునకు అనుమతించారు.
ఒత్తిడిలో కేంద్రమంత్రి సుజనా చౌదరి: 100 కోట్లు చెల్లించాల్సిందే!
సుజనా చౌదరితో సహా నిందితులంతా రూ.50 వేల చొప్పున రెండేసి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. తమకు హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ శ్రీనివాసరాజు, హనుమంతరావులు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. అయితే, తాజాగా సుజనా చౌదరిపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.