వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం .. రీజన్ ఇదే
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్నిసాధించింది . ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు జగన్ తన మంత్రివర్గంలో కూడా అన్ని వర్గాల వారికి సమన్యాయం కల్పించి వారిని కూడా ఆ శాఖలలో ఎలాంటి అవినీతి లేకుండా చూసుకోవాలని, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకూడదని ముందుగానే హెచ్చరించారు. అయినా వైసీపీ నేతల పై ఏదో ఒక ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది.
Recommended Video
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబుకు షాక్ ఇచ్చింది ఒంగోలు సంచార న్యాయ స్థానం. ఎం.ఎస్ బాబుకు అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెక్కు బౌన్స్ కేసులో ఆయన కోర్టుకు వాయిదాకు హాజరు కానందున ఆయనకు న్యాయస్థానం వారెంట్ జారీచేసింది. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెక్స్ బౌన్స్ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వింటోంది. కానీ బాబు మాత్రం విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్గా స్పందించింది. ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇక ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులే న్యాయస్థానాన్ని గౌరవించకపోతే ఇక సామాన్య జనం పరిస్థితి ఏంటి అంటూ పలువురు నేతలు ఆ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పక్క జగన్ ప్రజా ప్రతినిధులుగా మచ్చ లేకుండా పని చెయ్యాలని సూచించినా పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్ళలోనే ఇలా ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావటం వైసీపీ వర్గాల్లో చర్చకు కారణం అవుతుంది. మరి ఈ అరెస్ట్ వారెంట్ పై పూతలపట్టు ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.