ఏపీలో కరోనా: గుంటూరులో తొలి మరణం.. మళ్లీ పెరిగిన కేసులు.. ఒక్క జిల్లాలోనే 11 మందికి వైరస్
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 మరణాలు, కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. కొత్తగా 15 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

గుంటూరులో తొలి మరణం..
గురువారం ధృవీకరించిన మరణాల్లో అనంతపురం జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఇంతకుముందే హిందూపూర్ లో ఒక మరణం చోటుచేసుకోగా, అనంతపురం జిల్లాలో ఇప్పుడా సంఖ్య రెండుకు పెరిగింది. కృష్ణా జిల్లాలో విజయవాడలో ఒకటి, మచిలీపట్నంలో మరోక మరణాలు సంభవించాయి. విశాఖపట్నంలో ఒకరు కొవిడ్-19కు బలయ్యారు. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, గుటూరులో ఇవాళే తొలి కరోనా మరణం నమోదైంది.

మృతుడి బంధువుల్ని..
గుంటూరు ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తిని నర్సారావుపేట వాస్తవ్యుడిగా గుర్తించారు. అతను టీబీతో బాధపడుతూ, 10 రోజుల క్రితం గుంటూరులోని ఇన్ఫెక్షస్ డిసీజ్ హాస్పిటల్(ఐడీహెచ్)లో చేరాడని, రెండ్రోజుల కిందటే ఆయన చనిపోగా, అనుమానంకొద్దీ టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలిందని డాక్టర్లు చెప్పారు. దీంతో మృతుడి కుటుంబీకులు, గతంలో అతణ్ని కలిసినవాళ్లందరినీ క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Recommended Video

ఒక్క జిల్లాలోనే 11 కొత్త కేసులు..
ఏపీ సర్కారు తాజాగా వెల్లడించిన వివరాల్లో.. కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 11 ఒక్క ప్రకాశం జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడపలో ఒక్కో కొత్త కేసు నమోదైంది. జిల్లాల వారీగా జిల్లాల వారీగా పరిశీలిస్తే, కర్నూలులో అత్యధికంగా 75 పాజిటివ్ కేసులుండగా, కొత్త కేసులతో గుంటూరు (51) రెండో స్థానానికి చేరింది. ఆ తర్వాతి జాబితాలో నెల్లూరు (48), ప్రకాశం (38), క్రిష్ణా (35) జిల్లాలున్నాయి. ఇప్పటిదాకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తికి వ్యాధి పూర్తిగా నయమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డిశ్చార్జి అయినవారి సంఖ్య 10కి పెరిగింది.












Click it and Unblock the Notifications