ఏపీలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి -కొత్తగా 349 కేసులు, 2మరణాలు -విజయనగరం‘జోరో’ -1కోటికి వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. టెస్టులను యధావిధిగా కొనసాగిస్తున్నా, వెలుగులోకి వచ్చే కొత్త కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. అదే సమయంలో రికవరీలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు రాష్ట్రంలో ఒక కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రణాళికలు వేసిన ప్రభుత్వం.. టీకా పంపిణీకి ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,386 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 349 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 8,81,061కు చేరింది. కోవిడ్ కారణంగా కొత్తగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7094కు చేరింది. బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చిన మరో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. వీటి శాంపుల్స్ను పూణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపారు. దీంతో యూకే నుంచి స్టేట్కు వచ్చిన వారిలో పాజిటివ్ సంఖ్య 6కు చేరింది. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరు జిల్లాలో ఇద్దరికి చొప్పున వైరస్ నిర్ధారణ అయింది.

నిన్న ఒక్కరోజే కొత్తగా 422 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95శాతం కాగా, ఏపీలో మాత్రం మెరుగైన రికవరీ రేటు 98.78 కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,70,342కు చేరింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 3625 యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా జరిపిన టెస్టుల సంఖ్య 1,16,20,503కు చేరినట్లు వైద్య శాఖ బులిటెన్ లో పేర్కొంది.
గడిచిన ఏడు నెలల్లో తొలిసారిగా విజయనగరం జిల్లాలో కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదుకాలేదు. అన్ని జిల్లాల కంటే ఆఖరున కరోనా బారినపడ్డ విజయనగరం.. మిగతా జిల్లాల కంటే ముందుగా 'జీరో కరోనా' స్థాయికి చేరడం గమనార్హం. ప్రస్తుతం ఆ జిల్లాలో అత్యల్పంగా 54 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా రాలేదు. చిత్తూరు జిల్లాలో కొత్తగా 105 కేసులు వచ్చాయి. అలాగే..
గడిచిన 28 రోజులుగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈనెల రోజుల్లో కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 28 రోజుల్లో కృష్ణాలో అత్యధికంగా 27 మంది, గుంటూరు జిల్లాలో 14 మది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు..
ఏపీలో ఒక కోటి మందికి కరోనా టీకాలను అందిస్తామంటోన్న ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లను చేస్తున్నది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్ సిరంజీలు చేరుకున్నాయి. వ్యాక్సిన్ నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఐస్ కోల్డ్ రిఫ్రిజిరేటర్లును కూడా ప్రభుత్వం తెప్పించింది. సోమవారం నుంచి విజయవాడలో మొదలు పెట్టనున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications