‘మర్కజ్’తో ఏపీలో కోరానా విలయం.. శవాలు చూసి సంబరాలేంటని వైసీపీ ఫైర్.. ఆ 711 మంది ఎవరంటే..
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ కొద్దొ గొప్పో ప్రశాంతంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాంలోని పురాతన మర్కజ్ మసీదులో వైరస్ విస్పోటనం చెందడం, ఆ సమయంలో ఏపికి చెందిన 711 మంది అక్కడున్నారని సోమవారం రాత్రి వెల్లడికావడంతో రాష్ట్రం ఒక్కసారే ఉలిక్కిపడింది. టెక్నాలజీ సాయంతో అనుమానితుల్ని ట్రాక్ చేయగా.. కేవలం 12 గంటల వ్యవధిలో ఏకంగా 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 40కి పెరిగింది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో కరోనాపైనా పార్టీల మధ్య రాజకీయ విమర్శప్రతివిమర్శలు కొనసాగుతుండటం.. మర్కజ్ ఉదంతం తర్వాత అవి మరింత పీక్స్ కు వెళ్లడం జరిగిది.

చావులపై రాజకీయాలు..
మర్కజ్ ఉదంతం వెలుగులోకి రావడానికి ముందు, విశాఖపట్నం జిల్లాలో ఓ వృద్ధురాలు రేషన్ సరుకుల కోసం క్యూలైన్లో నిలబడి కుప్పకూలిందన్న వార్త ప్రతిపక్ష టీడీపీకి ఆయుధంగా మారింది. కరోనా కట్టడి విషయంలో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని తిట్టిపోస్తున్న టీడీపీ.. వృద్ధురాలి చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే ఇలాంటి కఠోర సమయాల్లో చంద్రబాబు అండ్ టీమ్ శవాలపై రాజకీయాలు చేస్తున్నారని, డెడ్ బాడీలు చూసి సంబరపడుతున్నారని, ప్రజల చావులు కోరుకుంటున్న ఉన్మాది చంద్రబాబని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

పచ్చ వ్యాపారం పోయిందనే..
ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండిఉంటే, కరోనా నియంత్రణ పేరుతో రోజుకో ఫుల్ పేజీ యాడ్ వేసుకుని, దండిగా దండిగా డబ్బులు సంపాదించుకోవచ్చని, తద్వారా తమ వ్యాపారం పచ్చగా ఉండేదని ఎల్లో మీడియా అధినేతలు అనుకుంటున్నారని, ఇప్పుడా అవకాశం లేకపోయేసరికి.. మూర్ఛరోగుల్లా గిలగిలా కొట్టుకుంటున్నారని, కరోనా విషయంలో సీఎం జగన్ సీరియస్ గా లేరంటూ అవాస్తవాలు రాస్తున్నారని విజయసాయి చెప్పుకొచ్చారు. ప్రజల చావుల్ని కోరుకుంటోన్న ఉన్మాదులను ఓదార్చలేమంటూ బాబు అనుకూల మీడియాను ఉద్దేశించి ఆయన విమర్శించారు.

వైసీపీ శ్రేణులకు పిలుపు..
కరోనా విషయంలో సీఎం జగన్ విధానాలను దేశమంతా మెచ్చుకుంటున్నదని, వాలంటీర్ల వ్యవస్థను కేరళ కూడా స్వీకరించిందని ముందునుంచీ వాదిస్తోన్న విజయసాయి.. వైరస్ పై పోరాటంలో ఏపీ అందరికంటే ఒక అడుగు ముందే ఉందని మరోసారి గుర్తుచేశారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తలంతా సహాయ కార్యక్రమాల్లో పొల్గొనాలని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా చూడాలని, అయితే ఆ సమయంలో కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ఎంపీ కోరారు. ప్రభుత్వ పరంగా సహాయ ఏర్పాట్లలో ఏవైనా లోపాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు.

గోతికాడ నక్కలా..
శవాలపై పేలాలు ఏరుకోవడమే చంద్రబాబు రాజకీయ విధానమంటూ మూడ్రోజుల కిందట మండిపడ్డ విజయసాయి.. మరోసారి టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఎవరు చనిపోతారా? అని గోతికాడ నక్కల్లా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎదురు చూస్తున్నారని, కరోనాపై విమర్శలకు అవకాశం దక్కకపోవడంతో కుళ్లికుళ్లి ఏడుస్తున్నారని, అంతలోనే డెడ్ బాడీలు చూసి సంబరపడుతున్నారని, విశాఖ జిల్లాలో వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోతే, దానికి కరోనా లాక్ డౌన్ తో ముడిపెట్టి రేషన్ కోసం నిలబడ్డందుకే ప్రాణాలు కోల్పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ అన్నారు.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి..
ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ‘తబ్లిగి జమాత్' ప్రార్థనల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. ఈనెల 13-15 మధ్య జరిగిన ఆ ప్రార్థనలకు దేశవిదేశాల నుంచి సుమారు 2వేల మంది హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఏకంగా 711 మంది అక్కడికి వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్కొక్కరినీ ట్రాక్ చేస్తూ టెస్టులు చేస్తుండగా, మంగళవారం ఉదయానికి పాజిటివ్ కేసులు సంఖ్య 40కి చేరింది. వీటిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మందికి వైరస్ సోకింది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారంతా తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఢిల్లీకి వెళ్లొచ్చింది వీళ్లే..
జిల్లాలు, ప్రాంతాల వారీగా ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చినవాళ్ల వివరాలివి.
విజయనగరం జిల్లా: 3
విశాఖపట్నం రూరల్: 1
విశాఖపట్నం సిటీ: 41
తూర్పు గోదావరి జిల్లా: 6
పశ్చిమ గోదావరి జిల్లా: 16
రాజమండ్రి: 21
కృష్ణ జిల్లా: 16
విజయవాడ సిటీ: 27
గుంటూరు అర్బన్: 45
గుంటూరు రూరల్: 43
ప్రకాశం జిల్లా: 67
నెల్లూరు జిల్లా: 68
కర్నూల్ జిల్లా: 189
కడప జిల్లా: 59
అనంతపూర్ జిల్లా: 73
చిత్తూరు జిల్లా: 20
తిరుపతి: 16
మొత్తం: 711












Click it and Unblock the Notifications