ఏపీలో కరోనా: తగ్గని ఉదృతి - లక్షకుపైగా యాక్టివ్ కేసులు - ఆ 5 జిల్లాల్లో టెన్షన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. ఇప్పటికి వరుసగా తొమ్మిది రోజులుగా 10వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. కరోనా వల్ల చనిపోతున్నవారి సంఖ్యను తగ్గించడమే టార్గెట్ అన్న ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించినా, వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. కేసులు, మరణాల పరంగా ఐదు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారింది. మరోవైపు తిరుమలలో ఓ ఉద్యోగికి రెండోసారి కరోనా సోకడం సంచలనం రేపింది.

టాప్-2లో ఏపీ..
కొత్తగా వెలుగులోకి వచ్చిన 10,776 కేసులతో కలుపుకొని ఏపీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,73,611కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 75 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 4,276కి చేరింది. మొత్తం కేసుల సంఖ్యలోనేకాదు, యాక్టివ్ కేసుల పరంగానూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్2 స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో మొత్తం 8.43లక్షల కేసులు, 25,586 మరణాలు, 2.05లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, ఏపీలో 4.76లక్షల కేసులు, 4,276 మరణాలు, 1.02లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆ ఐదు జిల్లాల్లో ఆగమాగం..
వైద్యారోగ్య శాఖ శుక్రవారం వెల్లడంచిన లెక్కల ప్రకారం ఐదు జిల్లాల్లో పరిస్థితి ఒకింత భయానకంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1405 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,305కు, మరణాలు 421కి పెరిగాయి. నెల్లూరులో కొత్తగా 1270 కేసులు, ఎనిమిది మరణాలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 1256 కొత్త కేసులు, తొమ్మిది మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో కొత్తగా 970 కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 924 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి.

భారీగా డిశ్చార్జిలు..
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 59,919 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 39.65లక్షలకు పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే ఏపీలో రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 12,334 మంది వివిధ ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో మొత్తంగా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,67,268గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.02 లక్షలుగా ఉంది.

ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా..
ఏపీలో కొత్త కేసుల సంఖ్య వెల్లువలా పెరుగుతోన్న వేళ.. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన విషయం సంచలనంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో సెక్యూరిటీ విభాగం ఉద్యోగి గత జులైలో కరోనా నుంచి కోలుకోగా, మళ్లీ ఇప్పుడు రెండోసారి పాజిటివ్ గా తేలారు. ఒక వ్యక్తి రెండోసారి కరోనాకు గురికావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయనను శ్రీనివాసం కొవిడ్ సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications