ఏపీలో కరోనా: కొత్తగా 9,536 కేసులు - 5వేలకు చేరువగా మరణాలు - ఉభయగోదావరిలో అదే సీన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 72,233 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 9,536 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.67లక్షలకు పెరిగింది.
కొత్త కేసులతోపాటు రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మహమ్మారి కాటుకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా ఏడుగురు చొప్పున, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4,912కు పెరిగింది.

కొత్త కేసులు, మరణాలతోపాటు ఏపీలో డిశ్చార్జీల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 10,131 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆదివారం నాటి బులిటెన్ లో పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసులు(5,67,123)కుగానూ 4,67,139 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లయింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులున్నాయి.
కొత్త కేసులు, మరణాల పరంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరిలో కొత్తగా 1414 కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 76, 808 కేసులతో ఈ జిల్లా రాష్ట్రంలోనే టాప్ లో ఉంది. ఇక పశ్చిమ గోదావరిలో కొత్తగా 1076 కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 50,474గా ఉంది. గత 24 గంటల్లో చిత్తూరులో కొత్తగా 957 కేసులు, నెల్లూరులో 844, గుంటూరులో 792, ప్రకాశంలో 788, శ్రీకాకుళంలో 733 కొత్తకేసులు వచ్చాయి.












Click it and Unblock the Notifications